|
|
Articles: TP Features | తెలుగు విజ్ఞానం అనంతం - Site Administrator
| |
(ఆచార్య ఆర్వీయస్ సుందరం)
తెలుగువారి ప్రాచీనభాష హోదా అందరాని మ్రానిపండుగానే మిగిలిపోయింది. అది వచ్చినా తెలుగువారికేమైనా మంచి జరుగుతుందని, ఉపయోగకరమైన పరిశోధనలు జరుగుతాయనే ఆశలు కూడా అడుగంటిపోయాయి. ఎందుకంటే తెలుగువారిలో తమ జాతిని గురించి, సంస్కృతిని గురించి, సాహిత్యాన్ని గురించి స్పృహ అంతంత మాత్రమే. ప్రాచీన భాషా హోదా రాక ముందే దాని గురించి నిజంగా కృషిచేసిన వారిని వదలి నాటకాలాడేవారికి కొన్ని పురస్కారాలందజేసి చేతులు దులుపుకున్నప్పుడే మనవారికి ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది.
కర్నాటక రాష్ట్రం వైపు ఒక్కసారి దృష్టి సారించండి. కేంద్ర ప్రభుత్వం హోదాలో ఇచ్చినా ఇవ్వకున్నా కన్నడం విశిష్టభాష అని నిరూపించుకోవడానికి విస్తృత పరిశోధనలకు కర్నాటక ప్రభుత్వం కోట్ల రూపాయల ధన సహాయం చేస్తోంది. కర్నాటక రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఒక్కొక్క కన్నడ శాఖకూ రెండు కోట్ల రూపాయలిచ్చి పరిశోధన ప్రణాళికలు చేయవలసిందిగా పురమాయించింది. మన ప్రభుత్వానికి ఇలాంటి విషయాలపై ఇసుమంతయినా ఆసక్తి లేదని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు.
తెలుగు సాహిత్యంలో తెలుసుకోవలసిన విజ్ఞానాంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. నన్నయకు ముందు కాలం నుండి ఈనాటి వరకు తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞానప్రసారం ఎలా జరిగిందో తెలుసుకోవటానికి వంద రకాల పరిశోధనలు జరగాలి. వీటిని మనం తెలుసుకుంటే చాలదు, ప్రపంచానికి తెలియజెప్పాలి.
తెలుగు సాహిత్యమంటే కేవలం నన్నయ, తిక్కన, శ్రీనాథుడు మాత్రమే అనుకొంటే పొరబాటే. మన సాహిత్య చరిత్రలన్నీ కొంతమంది కవులకు, శాస్త్రకారులకు, గణితశాస్త్రజ్ఞులకు, కావ్య మీమాంసకారులకు అన్యాయం చేశాయి. తెలుగు సాహిత్య పరిధిని, శాస్త్ర పరిజ్ఞానాన్ని విస్తృతపరచిన విజ్ఞులకు గౌరవం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అప్పుడే రేచన, కేతన, పాల్కురికి సోమనాధుడు, భాస్కరుడు మొదలైనవారు తెలుగువారి విజ్ఞాన ప్రసారానికి ఎలా దోహదం చేశారో తెలుస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|