|
|
Articles: TP Features | ఒంటరితనం తోడుగా... - Site Administrator
| |
(లక్షీకాంతరావు)
ఏకాంతం... ఒంటరితనం ఒకటి కాదు. కానీ మనిషి ఒంటరి వాడైనప్పుడు ఏకాంతాన్ని తోడుగా చేసుకుంటాడు. డబ్బు, అధికారం అన్నీ ఉన్నా ఏకాంతంలోకి పారిపోయి ఒంటరితనాన్ని ఆశ్రయిస్తాడు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలోనే ఉండి, అందరితోనూ మాట్లాడుతూనే మనిషి మనసు పొరల్లో ఒంటరైపోతాడు. అధికారం అందుకున్నా, విజయాలను వరించినా మానసవీధుల్లో మానవుడు ఒంటరి పయనమే సాగిస్తాడు. అంతర్ముఖుడై, మౌనాన్ని తోడుగా తీసుకుని జీవితనడకను సాగిస్తాడు.
నిజానికి అధికారం మనిషి నెత్తిన ఒంటరితనాన్ని రుద్దుతుంది. స్నేహితులు ఉంటారు. కాని నమ్మదగినవారుగా ఉండరు. సాటి మానవుల నుంచి వేరుపడే సంఘటనలు సృష్టిస్తుంది. ఇప్పుటికిప్పుడు తాజా ఉదంతం చూడండి. టైగర్ వుడ్స్ ఖరీదైన గోల్ఫ్ క్రీడలో రారాజు. నిన్నటి వరకూ విజయం, ఆనందం, సంతోషం రంగరించిన మనిషిగా, కోటీశ్వరునిగా నీరాజనాలు అందుకున్నాడు. ఉద్వేగపూరితమైన క్షణాలు బద్దలైన మరుక్షణం ఒంటరితనంలో చిక్కుకుపోయాడు. సెల్ ఫోన్ నంబర్లు మార్చుకున్నాడు. ఎవరూ పలకరించే వీలు లేకుండా చేసుకున్నాడు. ఆఖరికి స్నేహితులకు కూడా. ఏకాంతంలో వుడ్స్ కార్టూన్ సినిమాలు చూస్తూ, రాత్రి వేళల్లో ఒక్కడే గోల్ఫ్ ఆడుకుంటూ, నానపెట్టిన గింజలు తింటూ బతుకుతున్నాడు.
గొప్ప మేథావులుగా, గొప్ప వ్యక్తులుగా ప్రపంచం చేత కీర్తింపబడిన చాలా మంది చివరకు ఏకాంతాన్ని ఎంచుకుని ఒంటరిగానే మిగిలిన చరిత్ర మనకు ఉంది. ప్రతీ మేథావీ ఏకాంతాన్నే అంతిమంగా ప్రేమిస్తాడనేది ఈ చరిత్ర చెబుతున్న సత్యం. విశ్వ సినీ సంగీత ప్రపంచంలో చమక్కున మెరసిన భారత తార ఎఆర్ రెహ్మాన్ జీవితంలో కూడా అంతులేని ఒంటరితనం జాడలు అనేకం. రెహ్మాన్ జీవితచరిత్ర రాసిన కామినీ మిథాయ్ ఈ విషయాన్ని ధృవీకరిస్తారు. రాగాల సృష్టికి రెహ్మాన్ ఏకాంతాన్నే ఎంచుకుంటారని అతని సన్నిహితుడు విజయ్ అయ్యర్ చెబుతారు. లాస్ ఎంజెల్స్ నగరంలో ఉదయం వేళ ఒంటరి నడకను రెహ్మాన్ ప్రేమిస్తాడు.
రాజకీయాల్లో సైతం ఒంటరితనమే మిగులుతుంది. గొప్ప రాజకీయ నాయకులు, మహా పాలకులు, నియంతలు కూడా కడకు ఒంటరితనాన్నే అనుభవించారు. జర్మనీ నియంత హిట్లర్ ఒంటరివాడని అందరికీ తెలుసు. 'నా కౌమార దశను దాటేటప్పుడు ఉన్న పరిస్థితులు అంత సులువైనవి కావు. ప్రపంచం చాలా దుర్మార్గమైంది. ముఖ్యంగా సున్నిత మనస్కులు రాటుదేలడానకి' అని తండ్రి నెహ్రూకు రాసిన లేఖలో ఇందిరాగాంధీ తన ఒంటరితనాన్ని వివరించింది. మన దేశపు ఉక్కు పోలీసు కిరణ్ బేడీ కూడా ఏకాంతాన్ని తోడుగా తీసుకుని సుదీర్ఘ పయనం సాగించిన మహిళే. 'ఉన్నతస్థాయిలో ఒంటరితనం ఉంటుంది. అందునా ఆ స్థానం కోసం చాలా మంది పోటీ పడుతుండగా ఒకరు దానిని చేరుకుంటే మరీను. తాము కోరుకున్న దానిని పొందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంటారు. కానీ కుటుంబ ఆలంబనే ఆ వ్యక్తిని కాపాడుతుందని' బేడీ చెబుతారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|