|
|
Articles: TP Features | పెరుగుతున్న అసహనం - Site Administrator
| |
(కిషన్)
మన పౌర సమాజంలో అసహనం పెరిగిపోతున్నది. ఈనాడు మనకు కనిపిస్తున్నది వేర్వేరు మతాలకు లేదా వేర్వేరు కులాలకు చెందినవారి మధ్య అసహనానికే ఇది పరిమితం కావడం లేదు. ఓటు బ్యాంకులను చేజిక్కించుకొనే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ఈ విభజన రేఖను మరింత పెద్దది చేస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఒక మతానికి లేదా వర్గానికి, ప్రాంతానికి అనుకూలంగా తీవ్ర వైఖరిని అనుసరిస్తుండడమే కాకుండా ఆ వర్గంవారి నుంచి పూర్తి విధేయతను రాబట్టుకోవడానికి మిగిలినవారిని దూరం చేసుకుంటున్నాయి.
ఇప్పుడు కొత్త తరహా అసహిష్ణుత కానవస్తున్నది. ప్రాంతీయవాదం, భాషా దురభిమానం తీవ్ర సమస్యలుగా మారాయి. మహారాష్ట్ర ఈ విషయంలో తొలి అడుగు వేసింది. 'మహారాష్ట్ర మహారాష్ట్ర పౌరులకు మాత్రమే' అనే నినాదాన్ని రాజ్ థాకరే లేవదీశారు. దురదృష్టవశాత్తు తక్కిన రాజకీయ పార్టీలు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయాయి. మహారాష్ట్ర ఓటర్లను దూరం చేసుకోవడం వాటికి ఇష్టం లేదేమో! ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మరొక ఆకు ఎక్కువ చదివినట్లుగా మరాఠీ తెలియని టాక్సీ డ్రైవర్ ఎవ్వరికీ లైసెన్సు జారీ కాదని ప్రకటించారు. అయితే, ఆ తరువాత ఆయన వెనుకడుగు వేశారనుకోండి. కాని అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. థాకరే ప్రభావం మహారాష్ట్రకే పరిమితం కనుక ఆయన అభిప్రాయాలకు ఆయనను క్షమించవచ్చు. కాని కాంగ్రెస్ వంటి దేశవ్యాప్త పార్టీ అటువంటి దారుణ అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేయాలి?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కూడా కొందరు నాయకులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రభృతులు ఆంధ్ర ప్రాంతం వారికి స్థానం లేదంటూ నినాదాలు లేవదీశారు. రెండు ప్రాంతాలలోను తీవ్ర స్థాయిలో ఉద్యమాలు సాగాయి. తెలంగాణ అంశం తేల్చడానికి ఒక కమిటీని వేసి అందరికీ న్యాయం జరిగేట్లు చూస్తానని కేంద్రం హామీ ఇచ్చిన తరువాత ఉద్రిక్తత తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|