|
|
Articles: TP Features | రాజుల మాతృభాష ఏమిటి? - Site Administrator
| |
ఇలాంటి వాటిని సాగదీసినా ప్రయోజనం ఉండదేమో! ఏ రాజయినా సరే ఏ భాష మీద అభిమానం చూపించాడు. ఏ భాషని పోషించాడు. ఏ భాషలో పాండిత్యం సంపాదించాడు అన్నది ముఖ్యమనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు తెలుగుభాష మీదే ఎక్కువ అభిమానం చూపాడనడంలో సందేహం లేదు. రాయల కాలానికి తెలుగుభాష మహాకావ్య భాషగా మహోన్నత స్థితిలో ఉంది. ఆనాటికే మహాకవులు ఎంతోమంది తెలుగులో మహాకావ్యాలు రాయగలిగి ఉన్నారు. రాయలు పరిపాలించిన సామ్రాజ్యంలో తెలుగువారు, కన్నడంవారు, తమిళులు, మరాఠీలు ఓఢ్రభాషవారు కూడా ఉన్నారని మరచిపోరాదు. అయితే ఆనాటి భాషాస్థితిని బట్టి రాయలు తెలుగు మీద ఎక్కువ అభిమానం చూపి ఉంటాడు. ఆయన మాతృభాష తెలుగయినా కాకపోయినా తన రాజ్యంలోనే ఎక్కువమంది మాట్లాడే తెలుగుభాషను అభివృద్ధిపరచడంలో క్రియాత్మక పాత్ర నిర్వహించాడు.
తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇలాంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. కన్నడ రాజ్యలక్ష్మినే ఏలిన ప్రౌఢ దేవరాయలు శ్రీనాథ మహాకవి ప్రతిభకు నిరుత్తరుడై కనకాభిషేకం చేసి కవిసార్వభౌముడివని కీర్తించాడు. విజయనగర రాజుల సామంతులుగా తంజావూరు, మధురలకు వెళ్ళిన నాయకరాజుల మాతృభాష తెలుగే అనిపిస్తుంది. వారిది కన్నడమూ కాదు, తమిళమూ కాదు. వారు తెలుగు భాషకు పట్టంకట్టారు. కాబట్టే ఆంధ్రదేశం నుండి వందల మంది కవిపండితులు తంజావూరు, మధురలకు తరళివెళ్ళారు. తెలుగులోనే కొన్ని వందల రచనలు చేశారు. త్యాగరాజులాంటి వారు తెలుగులో అద్భుత కృతుల్ని అందించారు.
నాయక రాజుల తర్వాత తంజావూరిని ఏలినవారు మహారాష్ట్రులు. అయితే అప్పటికే సాహిత్య వాతావరణమంతా తెలుగు తీపితో నిండి ఉండడంతో మహారాష్ట్ర రాజులు కూడా తెలుగు నేర్వక తప్పింది కాదు. శహజీ, ఏకోజి, తులజాజి, తుక్కోజి, శరభోజి వీళ్ళంతా తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు చేశారు.
ఇక మెకంజి, సి.పి.బ్రౌన్ లాంటివారు సరేసరి. ఆధునిక తెలుగుభాషా సాహిత్యాలకు చుక్కాని లాంటి వాడయిన బ్రౌన్ మహాశయుడు తన మాతృభాష తెలుగు కాకున్నా తెలుగువాడే అయ్యాడు. అలాగే తెలుగు మీద అభిమానం చూపిన, సేవచేసిన రాజులందరి మాతృభాష ఏమయినా కానివ్వండి, వారు తెలుగువారే.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|