|
|
Articles: TP Features | 'శ్రీకృష్ణ' ముందున్న సవాళ్లు - Site Administrator
| |
(ప్రొఫెసర్ జి. హరగోపాల్)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశంపై పరిశీలనకు జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ అధ్యక్షతన కొంతమంది సోషల్ సైంటిస్టులతో ఒక కమిటీని నియమించడం ఈ సమస్య పరిష్కారం దిశగా ఒక ముఖ్యమైన అడుగు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే, సంక్లిష్టతలను గుర్తించి, క్రియాశీలక ప్రతిపాదనలను కమిటీ సూచించగలుగుతుందా అనే సందేహాలు అన్ని ప్రాంతాల ప్రజల మనస్సులలోనూ తలెత్తుతున్నాయి. కమిటీ వీటన్నిటినీ అవగాహన చేసుకోగలదని భావించినప్పటికీ, సంబంధిత పార్టీలకన్నిటికీ సంతృప్తికరమైన పరిష్కారాన్ని కనుగొనగలుగుతుందా? ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా, వనరులు, జలాలు, ముఖ్యంగా కృష్ణాజలాల కేటాయింపు వంటి కొన్ని వివాదాలు ఉన్నాయి. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కొన్ని చర్యలను కమిటీ సూచిస్తుందని భావించినప్పటికీ గతంలో వాగ్దానాల భంగం జరిగిన దృష్ట్యా వీటి అమలు జరుగుతుందా, జరిగితే ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
పరిష్కారం కావలసిన సమస్యలు అనేకం ఉన్నాయి. కాని వాటిలో తక్షణం దృష్టి పెట్టవలసినవి కనీసం నాలుగు ఉన్నాయి. వాటిలో మొదటిది - ప్రపంచీకరణ ప్రక్రియ విస్తరిస్తుండగా దేశం - రాష్ట్రం పోషించే పాత్ర అంతకంతకూ కుంచించుకుపోతున్నది. మార్కెట్ శక్తులు పోరు బాట పట్టాయి. ప్రాంతీయ అసమానతలను ఏవిధంగా తొలగిస్తారు? ఆ లోపాలను సరిదిద్దే చర్చలకు నయా సరళీకరణ విధానంలో ఏమాత్రమైనా వీలు కలుగుతుందా? ఎందుకంటే ఈ ప్రక్రియ వనరుల పునఃకేటాయింపుతో కూడుకున్నది. ప్రభుత్వమే ఈ పని చేయవలసి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రణాళికా ప్రక్రియకు స్వస్తి చెప్పారు. పదవ పంచవర్ష ప్రణాళికా పత్రం గాని, పదకొండవ పంచవర్ష ప్రణాళికా పత్రం గాని లేవు. ప్రాంతాల మధ్య అసమానతల గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేని ఒక ప్రైవేట్ విదేశీ సంస్థ రూపొందించిన 20-20 డాక్యుమెంట్ ఒకటి ఉన్నది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రభుత్వం వెనుకడుగు వేసిన స్థితిలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ చోటుచేసుకున్న గత రెండు దశాబ్దాలలో విపరీత స్థాయిలో పెరిగిపోయిన అటువంటి లోటుపాట్లను ఏ కమిటీ అయినా ఎలా సరిచేయగలదు?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|