ఒక చోటు నుంచి మరో చోటికి పయనించినపుడు, వారి భాష వీరికీ - వీరి భాష వారికీ తెలియక అయోమయం, గందరగోళ పరిస్థితులొచ్చాయి. చదువుకున్నవాడైనా భాష తెలియని ప్రాంతానికెడితే, అతను చవటగానే పరిగణన పొందుతాడు. అయినా మూగవాడు చెప్పదల్చుకున్నది చెప్పగలిగినట్టు చెప్పి, తన అవసరాలను తీర్చుకుంటాడు మనిషి. తిండి సంపాదించుకుని కాలక్షేపం చేస్తాడు. అప్పుడు అక్కడి భాష పదాలు కొన్ని ఇతనికి అర్థమై, వాటిని అనుకోకుండానే తన భాషలో కలిపి చెబుతూ అక్కడివారికి అర్థమయ్యేలా చేసి తనకు కావలసిన పనులు నిర్వర్తించుకుంటాడు. ఆ విధంగా వివిధ ప్రదేశాల్లో వివిధ భాషలు పుట్టి, వేటికవే అభివృద్ధి చెందాయి. తెలుగు - తెలుగే, తమిళం - తమిళమే! మనకి నూరిపోస్తున్న ఈ పెద్దల మాటే ఎందుకు కరెక్టనుకోవాలి?
ఎందుకిలా కాకూడదు? డార్విన్ థీరీయే కరెక్టని ఎందుకనుకోవాలి? లామార్క్ థీరీ కరెక్ట్ కాకూడదా?! ఎందుకంటే ఇంతవరకూ తోక లేని కోతి పుట్టడం జరగలేదు మరి! చరిత్ర పరిశోథకులందరూ ఒకే తోవన ఒకడి వెనక ఒకడు - గుడ్డెడ్లు చేలో పడ్డట్టు వెడతారు. దానికి కారణమేమంటే, వారి గురువుల పద్ధతినే వారు నడవాలి. అలా వెళ్లకుంటే, వారికి సర్టిఫికెట్ రాదు. అదేదో సినిమాలో చూపినట్టు పెద్ద గోడ పైన పేడముద్దలు చూసి, పూర్వం ఆవులూ - బర్రెలూ ఆ ఎత్తులో ఉండేవి అందువల్ల అవి ఆ ఎత్తులో పేడ వేశాయి అన్నారు చరిత్ర పరిశోధకులు. అప్పుడే అక్కడికి ఒక ముదుసలి వచ్చి నిచ్చెన వేసుకుని పైకెక్కి అక్కడున్న పిడకలని గంపలోకెత్తుకుని కిందకి దిగింది. అందువల్ల, మరో కోణంలో ఈ భాషాభివృద్ధి గూర్చి ఆలోచిద్దాం. ఎవరి భాష వారికి అభివృద్ధి చెందినా ప్రయివసీ కోసం పుట్టాయనుకున్నా మూల భాషలోని పదాలు సేకరించి వాడటం ఉండదు. ఎందుకంటే, వీరు మాటాడేది అవతలి వారికి తెలుస్తుంది. శత్రువుల మధ్య బతకటం కోసం, కచ్ఛితమైన విభిన్న భాష ఉండి తీరాలి.
ఇదిలా ఉండగా ఆర్యుల భాష సంస్కృతం అన్నారు. అప్పటికి ఇంకా లిపి లేదు అనుకుందాం. లిపి కొన్ని గుర్తులు పెట్టుకుని, ఆ గుర్తును చూడగానే ఇలా పలకాలి అనుకున్నారనుకుందాం. ఆ విధంగా అనేక గుర్తులు తదుపరి అక్షరానికి నాంది అయ్యాయి. అందువల్లే విభిన్న భాషా అక్షరాలు కలవకుండా ఉంటాయి చాలామట్టుకు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అక్షరాలు గుండ్రంగా ఉంటాయి అని ఉత్తర హిందూస్థానీయులు అంటారు. అయితే అరవం, మలయాళం గుండ్రంగా అనిపించినా గీతలు తగిలించుకుని కొద్ది దేవ నాగర లిపి టైప్ లో కనిపిస్తాయి. అరవం అక్షరాలు తెలీని వారు కొంచెం హిందీ అక్షరాలు తెలిస్తే, మనం ఏదేని రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు, ఆ స్టేషన్ పేరు మనకి తెలిసుంటే, ప్లాట్ ఫారం మీది బోర్డు కూడబలుక్కుని చదవగలుగుతాం హిందీ అక్షరాలను ఊహించుకుని. అయితే తమిళులు తమ భాష సంస్కృతం నుంచి పుట్టలేదంటారు. అది భాషోన్మాద భావోద్వేగం. వారికి ఇది చాలా ఎక్కువ.
సంస్కృతాన్ని దేవభాష అన్నారు. సంస్కృత లిపిని దేవనాగర లిపి అన్నారు. మన తెలుగును దేవనాగర లిపిలో రాయం. మన అక్షరాలు మనకున్నాయి. హిందూస్థానీ వారికి యు.పి. వారికి లిపి ఉండి చావలేదు. వారిది పూర్తి బోల్ బాల్ భాష. అందువల్ల హిందీ సంస్కృత దేవనాగర లిపిని ఎరువు తీసుకుని లిపి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మహరాష్ట్రీయులు మరికొందరూను. ఈ విభిన్న భాషల వల్ల దేశం చెక్కలైపోతుంది. అందరూ ఆరాధించే దైవం ఒకరే. అందువల్ల వారి వారి ఆచార వ్యవహారాలు వేరైనా మరల వీరినందరినీ కలపవలసిన భాధ్యత తెలివైన ఘటాలపై పడింది.
అసలు సిసలైన మేధావులు ఇప్పుడు ఆలోచించారు. గుహ్యాత్ గుహ్యతరమైన భాష ఒకటి కనుక్కోవాలి. అది అందరికీ అర్థమవాలనే రూలు లేదు. ఆ విద్యనభ్యసించిన వారికి తెలిస్తే చాలు. వారు కూడా తమ భాషని అతి గోప్యంగా ఉంచి కాపాడాలి. అందులోని రహస్యాలను ఇతరులకు - విజాతి వారికి (రాక్షసులు?) అందకూడదు. అయితే వారూ వీరికి అన్నదమ్ములే అయినందువల్ల వారికీ ఆ సంస్కృతభాష తెలిసింది. అయినా ఒకే అక్షరానికి ఎన్నో అర్థాలూ - ఏకాక్షర అస్త్రాలూ - రకరకాల మంత్రాలూ తయారుచేసి, వాటిని పలకటంలో తేడాలతో, వక్రీకరించేలా చేసి, రాక్షసులను మట్టుపెట్టటానికి ఉపయోగించుకున్నారు. ఒకే అక్షరానికీ - పదానికీ ఎన్నో అర్థాలు సూచించటంవల్ల 'హరి', అనే మాటని 'కోతి'కి, రామాయణంలో వాడి, అదే 'హరి' అనే పదాన్ని
భాగవత రామాయణాల్లో 'విష్ణువు'కు వాడి, ఎన్నో గిమ్మిక్కులు చేసి ఒకే గ్రంథంలో రామాయణ, భారత, భాగవతాదులను కవులు ఇమిడ్చేశారు. అందువల్ల ఈ గుప్త భాష దేవ భాష అనీ, దీన్ని దేవతలే మాటాడతారనీ చెప్పి, తమ విద్యార్థులకు ఈ భాషలో విద్యలు బోధించేవారు.
|