శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు.
దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉద్భవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈ ఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు.
దీపం పరబ్రహ్మ స్వరూపం
'దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం
సర్వకమోపహమ్ దీపేన సాధ్యతే
సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే..'
దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో... ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెపుతోంది. అటువంటి పుణ్య దిన సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మిని అష్టోత్తరశతనామాలతో పూజ గావించి, సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుట వల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమని అన్నట్లు ఆ మహాలక్ష్మి ప్రసన్నమౌతుందట!
శ్లో: చతుర్భుజాం చంద్రరూపా ఇందిరా మిందు శీతలామ్
ఆహ్లద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్
|