రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ!
ఇవాల్టి యంగ్ హీరోలు బాలీవుడ్ లోనూ శుభారంభం పలికేందుకు సుముఖంగా ఉన్నారు. 'లీడర్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రానా ఇప్పటికే అభిషేక్ బచ్చన్ తో కలిసి ఓ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారనే వార్త ప్రముఖంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు 'మగధీర' రామ్ చరణ్ కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఫర్హాన్ అఖ్తర్, రితీష్ సిద్వానీల ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఓ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
రామ్ చరణ్ తో కమర్షియల్ యాడ్ తీసిన అభిషేక్ కపూర్ ఇటీవల 'మగధీర' చిత్రం చూసి అతని నటనకు ఎంతో ఇంప్రెస్ అయ్యారనీ, ఫర్హాన్ కు అతని పేరు సిఫారసు చేశారనీ తెలుస్తోంది. యాక్షన్ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు రామ్ చరణ్ లో ఉన్నాయని భావించిన ఫర్హాన్ తన ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ తదుపరి చిత్రానికి చరణ్ ను సంప్రదించారనీ, స్క్రిప్టు కూడా వినిపించారనీ చెబుతున్నారు. దీనికి 'హాఫిస్' అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇది ఇద్దరు మిత్రుల కథ అనీ, ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలోనే ఉంటుందనీ తెలుస్తోంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ధనవంతురాలైన ఒక అమ్మాయి, పేదవాడైన ఓ యువకుడు చుట్టూ నడిచే కథాంశంతో, బోలెడన్ని యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉంటుందనీ, దీపిక పడుకునే, కంగనా రనౌత్ లలో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశముందనీ ఆ వర్గాల భోగట్టా. కొసమెరుపు కూడా ఒకటుంది. హీరోయిన్ తండ్రి పాత్రకు చిరంజీవిని ఒప్పించాలని ఫర్హాన్ పట్టుదలగా ఉన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|