|
|
Articles: TP Features | మరాఠీ- తెలుగు అనుబంధం - Site Administrator
| |
(మచ్చ ప్రభాకర్)
మరాఠీ - తెలుగు భాషల సాంస్కృతిక అనుబంధం అతి ప్రాచీనమైనది. బౌద్ధకాలంలో అది మరింత గాఢంగా పెనవేసుకొని అభివృద్ధి చెందింది. అటు తూర్పు తీరంలోని మచిలీపట్టణం నుంచి ఇటు పడమట ముంబయి సముద్రతీరం దగ్గర గల కళ్యాణ్, నాలాసుపారా సముద్ర తీరాల వరకు విస్తరించిన వాణిజ్య, సాంస్కృతిక అనుబంధాలను దీనిని నిరూపిస్తున్నాయి. అమరావతి, నాగార్జునకొండ, ధాన్యకటకం, రాజధానుల నుంచి ఇటు పైఠన్ రాజధానిగా, కార్లా, అజంతా, ఎల్లోరా, నానేఘాట్, కన్నేరి వరకు శాతవాహనుల కాలంలోని చారిత్ర ఆధారాలు దానికి పుష్టిని కల్గిస్తున్నాయి. ఈ రెండు భాషల మూలాధారం ప్రాకృతభాష అయి ఉండవచ్చని పలువురు మేధావుల ప్రతిపాదన. తెలుగుభాషలో పదిశాతం సంస్కృతం, 90 శాతం మరాఠి ప్రాకృతం అంతర్భూతంగా ఉన్నట్లు తెలుగు విశ్వవిద్యాలయ మాజీ కులపతి డాక్టర్ తూమాటి దొణప్ప తమ `ధర్మచక్ర' నాటకంలో ప్రస్తావించిన ఆధారాలను బట్టి తెలుస్తున్నది.
తెలుగు జ్ఞానకోశ ముఖ్య సంపాదకులు కొమర్రాజు లక్ష్మణరావు ఆయన మరాఠీ రచయితగా ప్రసిద్ధి చెందినవాడు. ఈ రెండు ప్రాంతాల భాషలపై, సంస్కృతిపై పట్టున్నందువలన శాతవాహనుల కాలంలోని ఎంతో చరిత్రను బయటపెట్టి వారి అనుబంధాన్ని ధృఢపరిచాడు. అలాగే `ఆంధ్రుల చరిత్ర' పేర సురవరం ప్రతాపరెడ్డి రాసిన చరిత్ర పరిశోధనలో మౌర్య చంద్రగుప్తుని కాలంలో ఆంధ్ర - మహారాష్ట్ర రాజ్యాల మధ్య గల బంధాన్ని `మెగస్తనీస్' ఆధారాలతో బలంగా నిరూపించాడు.
డాక్టర్ తిరుమల రామచంద్ర `గాథాసప్తశతి'లోని 40 వాక్యాల నుంచి 40 తెలుగు శబ్దాలను వెలికి తీసి మరాఠీ - తెలుగు భాషల మధ్య గల సామ్యాన్ని గుర్తుకు చేశారు. ప్రసిద్ధ మరాఠీ రచయిత లక్ష్మీనారాయణ బొల్లి, ఆయన రాసిన `తెలుగు పూలలో మరాఠీ సుగంధం' గ్రంథం ద్వారా ఇదే అంశాన్ని ధృవీకరించారు. భౌగోళికంగా కలసినా ఈ రెండు ప్రాంతాల వారి సాహిత్య నిర్మాణం సాధారణంగా ఒకే కాలఖండంలో అనగా 11వ లేదా 12వ శతాబ్దంలో ఉన్నత స్థాయికి చేరి, పరిణతి చెందినట్లు ఆధారాలు చూపుతున్నాయి. రెండు భాషల వికాసం ఒకేవిధంగా కొనసాగినట్లు గమనించవచ్చు.
ప్రారంభ కాలంలో తెలుగు రచయితలు, తెలుగుతో బాటు మరాఠీభాషలోనూ రచనలు చేసిన ఆధారాలున్నాయి. 12వ శతాబ్దంలో తెలంగాణలోని పాల్కురికి సోమనాథుడు తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ కావ్యరచన చేసిన గ్రంథాలు లభించాయి. పాల్కురికిని `ద్విపద సాహిత్య పితామహుడని' అంటారు.
దేవ్ గర్ తుమీచ్! గురుదేవ్ మనూన్ తుమీచ్!..
దేవుడి ఇంటివి నీవే! గురుదేవుడవంటే నీవే... అంటూ రెండు వాక్యాలు మరాఠీలో, రెండు వాక్యాలు తెలుగులో రచించాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|