|
|
Articles: Festivals | దుర్గమ్మ కొలువైన వైనం - Site Administrator
| |
(సిహెచ్. సురేష్)
విజయవాడకే తలమానికంగా, రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద దేవాలయంగా విరాజిల్లుతోన్న కనకదుర్గ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వాశ్రమంలో ఇంద్రకీలుడనే మహర్షి రాక్షసుల భారినుండి ఈ లోకాన్ని కాపాడవలసిందిగా దుర్గను గురించి ఘోర తపస్సు చేయడంతో అతని తపస్సుకు మెచ్చి సాక్షాత్తూ అమ్మవారే స్వయంభువుగా ఈ ప్రాంతంలో కొలువుతీరారని ప్రతీతి. బ్రహ్మదేవునిచే ప్రతిష్టింపబడిన ఇంద్రకీలాద్రి గురించి పురాణాలలో చెప్పబడి ఉంది.
విజయవాడ ప్రస్థానం : మహాభారత యుద్ధానంతరం పాండవమధ్యముడైన అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతముపై తపమాచరించి శివుని వద్ద నుంచి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడని... ఈ ప్రాంతంలో ఆయన సాధించిన విజయానికి అర్జునుడు విజయుడుగా కీర్తించబడినాడని పురాణేతిహాసాలలో ఇతివృత్తంగా చెబుతారు. విజయుని పేరు మీదగా ఈ ప్రాంతం విజయపురిగా ఏర్పడింది. కాలక్రమేణా ఇది విజయవాడగా రూపాంతరం చెందింది. విజయవాడకు ముందర దీనిని బెజవాడగా కూడా పిలిచేవారు.
దానికి కూడా ఒక కథ వాడుకలో ఉండేది... విజయవాడ పట్టణానికే మకుటాయమానంగా విరాజిల్లుతున్న కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ఒకప్పుడు ఈ కొండకోనల ప్రాంతాన్ని ఢీకొని వెళ్లేందుకు మార్గం కానరాక కొండపై వెలసిన దుర్గాదేవిని వేడుకొనగా అందుకు దుర్గమ్మ కృష్ణవేణితో తనకు ముక్కుపుడక సమర్పిస్తే గానీ దారి వదలనని చెప్పడంతో కృష్ణవేణి తన ముక్కుపుడకను దుర్గకు సమర్పించుకుందట. అంతట దుర్గ కొండల మధ్యన కొద్దిగా బెజ్జం (రంధ్రం) చేసి కృష్ణమ్మకు మార్గం సుగమం చేసిందట...ఇంద్రకీలాద్రి బెజ్జం ద్వారా ప్రవహించిన కృష్ణమ్మ పరీవాహక ప్రదేశం కావడంతో దీనిని బెజ్జం వాడగా తర్వాత బెజవాడగా పిలవనారంభించారు జనం. దుర్గమ్మ అలంకరించుకున్న తన ముక్కపుడకను కలియుగాంతం సమయంలో కృష్ణ వేణి అందుకుంటుందని ప్రతీతి.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|