|
|
Articles: TP Features | తెలుగుజాతిని రక్షించుకుందాం - Site Administrator
| |
(డాక్టర్ సామల రమేష్ బాబు)
రాజకీయాలే జాతి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాజకీయాలే జాతి మనుగడను శాసిస్తాయి. అన్ని రంగాల మంచి చెడ్డలను ప్రభావితం చేయగల శక్తి రాజకీయాలకుంది. క్రీస్తుపూర్వం నాటి కౌటిల్యుడు తన 'అర్థశాస్త్రం'లో కూడా ఇదే మాటను చెప్పాడు - అన్ని శాస్త్రాల కంటే అర్థశాస్త్రం (రాజకీయశాస్త్రం) శక్తివంతమైనదని. రాజులు, మంత్రులు చెలాయించిన కాలం పోయి, నియంతల, సైనికశక్తి సంపన్న రాజ్యాల కాలమూ గతించి, ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు అవతరించిన తర్వాత రాజకీయాలు మరింత స్వేచ్ఛగా, విశృంఖలంగా జనజీవితాలను, జాతుల స్థితిగతులను శాసిస్తున్నాయి. ఇవి ఆయా దేశాల్లోని, ప్రాంతాల్లోని సామాజిక సాంస్కృతిక, పరిస్థితులను బట్టి ఉంటాయి గనుక అన్ని చోట్లా ఒకే కొలబద్దతో వాటిని అంచనావేయలేం. అందువల్లనే మన దేశంలో ఎంతటి గొప్ప అంతర్జాతీయ రాజకీయ సిద్ధాంతాలైనా కులాల, భాషల, మత విశ్వాసాల ప్రభావాన్ని అధిగమించి పనిచేయలేవు. ఇవి ఎంత సున్నితమైనవో, ఎంత తీవ్రమైనవో గ్రహించబట్టే ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయశక్తులు వీటిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోగలుగుతున్నాయి. వాటి నీడన రక్షణ పొందగలుగుతున్నాయి. వాటిని ఆ సమాజ హితానికి వ్యతిరేకంగా ప్రయోగించగలుగుతున్నాయి. ఆధిపత్య ధోరణులను ప్రదర్శించగలుగుతున్నాయి.
తెలుగుజాతి సరిగ్గా నేడు ఎదుర్కొంటున్నది ఈ పరిస్థితినే. దేశానికి స్వాతంత్ర్యం రావడంతో - తరతరాల అణచివేత నుండి, విదేశీ ఆధిపత్యం నుండి బయటపడినా, సొంత భాషలో నిండుగా ఊపిరి పీల్చుకోగల పరిస్థితులు నెలకొనలేదు. అందుకే - ప్రజల భాషకు కిరీటం పెట్టాలనుకున్న కొందరు పెద్దల ప్రతిపాదనలతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలయింది. ఇది స్వాభిమానం ప్రాతిపదికన తమ భాషలో తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వికసించాలనే ప్రగాఢ ఆకాంక్ష. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా ఈ ఉద్యమంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఆలోచనకు దారితీసింది.
ఇంతటి మహత్తరమైన ఆశయమూ - సహజమైన రాజకీయ లక్ష్యంతో కూడుకున్నదే. తప్పో ఒప్పో గాని పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం లక్ష్యసాధనలో కీలకంగా పరిణమించింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది. ఇక్కడే స్వార్థ రాజకీయాలు ప్రవేశించాయి. ఉద్యమానికి దారిచూపిన మహనీయుల ఆశయాలు, లక్ష్యాలు బూడిద పాలయ్యాయి. విస్తృత జాతి ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అధికారం మోజులో పడిన నాటి నాయకులు - అధికారంలోకి రాగలవారూ, ప్రతిపక్షంలో ఉన్నవారూ కూడా తొందరపడి, దక్కిందే చాలన్నట్లు దేశ నాయకుల ముందు తలలొంచుకొని అందినదే భిక్ష అన్నట్లు ప్రవర్తించారు. ఫలితంగా ఎన్నెన్ని ప్రాంతాలు - అటు మద్రాసు రాష్ట్రానికి (నేటి తమిళనాడుకు) హోసూరు, డెంకణికోట, పొన్నేరు, గుమ్మడిపూడి, కంటి, మద్రాసు నగరం, ఇటు మైసూరు (నేటి కర్ణాటక) రాష్ట్రానికి కోలారు, బెంగళూరు, చిత్రదుర్గం జిల్లా, తుంకూరు జిల్లాలో మధుగిరి, కొరటగిరి, సిర, పావగఢ తాలూకాలు ఇటువైపు ఒరిస్సాకు పాత కోరాపుట్, గంజాం జిల్లాలు (ఇప్పుడవి 7 జిల్లాలు) పోగొట్టుకున్నాం. శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి, దక్షిణాంధ్రులుగా పిలువబడే లక్షలాది తెలుగు తోబుట్టువుల కన్నీటిని పట్టించుకోలేదు. తర్వాత నైజాం నుండి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా బీదర్, గుల్బర్గా జిల్లాలో సేడం, చించోళి, గురుమిట్టకల్లు, నాందేడు తూర్పుప్రాంతం, యావత్ మల్, చాందాజిల్లా, భోసలే తెలంగాణ (దక్షిణ బస్తర్) లను జారవిడుచుకొన్నాం. తెలుగు భాషా రాష్ట్రంగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|