|
|
Articles: TP Features | తెలుగుజాతిని రక్షించుకుందాం - Site Administrator
| |
ఈ పరిస్థితుల్లో - పరస్పరం దూషణలతో, విద్వేషాగ్నిజ్వాలలను ఎగదోస్తున్న, కక్కుతున్న వివిధ ప్రాంతాల నాయకుల నుంచి తెలుగుజాతిని రక్షించుకోవడం ఎట్లా? ఏ స్వాభిమాన ప్రాతిపదిక మీద స్వరాష్ట్రోద్యమాలు జరిగాయో, అదేవిధమైన స్వాభిమాన ప్రాతిపదిక మీదే ఇప్పుడు వివిధ ప్రాంతాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇతర భాషీయుల పెత్తనాన్నుండి మనం విముక్తిని కోరుకోగా, ఇప్పుడు మనలో మనమే మనలోని ఆధిపత్యధోరణుల, స్వార్ధాల, రాజకీయ దుర్మార్గాల వలయంలోంచి బయటపడలేక యుక్తాయుక్త విచక్షణను వదిలివేసి తెగబడ్డాం. ఎంతో బలంగా ఉన్న ప్రజల కోరికను ఉద్యమంగా మలచుకోవడంలో, దాన్ని శక్తివంతంగా ముందుకు తీసుకుపోవడంలో విఫలమైన చంద్రశేఖరరావు ఆమరణ దీక్షనే ఆశ్రయించగా, అనేక మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నాటి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానాన్ని స్వార్ధ రాజకీయాలు ఎట్లా ఉపయోగించుకొని ప్రజలకు ద్రోహం చేశాయో, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా అటువంటి చరిత్రకే బీజాలు పడుతున్నాయన్నమాట. సమైక్యాంధ్ర పేరుతో మొదలైన ఉద్యమం సమాజానికిచ్చే అనుభవం కూడా అదే.
నిన్న, నేడు - ఈ రాజకీయ నేతలు ఈ ప్రజల భాషా సంస్కృతుల గురించి, స్వాభిమానాన్ని గురించి, శ్రేయస్సు గురించి పట్టించుకోలేదు. రేపు పట్టించుకుంటారనే ఆశ ఏమీ లేదు. కాని, నేడు నెలకొన్న పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల మధ్య రాజకీయ అభిమాన దురభిమానాలు గాఢంగా ఉన్న పరిస్థితుల్లో - తెలుగు ప్రజల భాషా సాంస్కృతిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవలసిన అవసరముంది. అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల ఈ దేశంలో విస్తరించి ఉన్న 18 కోట్ల మందినీ కలిపి ఒక రాష్ట్రంగా ఉంచడం ఎలా సాధ్యం కాదో, ఈ రాష్ట్రంలోని 9 కోట్ల తెలుగువారిని కూడా భౌగోళికంగా ఒకటిగానే ఉంచాలన్న పట్టుదల ఏమీ అక్కరలేదు. వైవిధ్యాలు వైరుధ్యాలుగా మారక ముందే, ప్రజల మధ్య సౌహార్ద్రతను నాశనం చేసేంతగా రాజకీయాలు బరితెగించక ముందే - రెండు కాకపోతే మూడు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని మా అభిప్రాయం. అన్నదమ్ముల మాదిరిగా విడిపోవడం వల్ల మంచే గాని, చెడేది ఏమీ ఉండదు. తెలుగువారికి రెండు మూడు రాష్ట్రాలున్నందున భావ సమైక్యతను కాపాడుకోవడానికి, భాషా సాంస్కృతిక వికాసానికీ మరింత శక్తీ ఒనగూడుతుందే గాని, దిగజారిపోయేదేమీ ఉండదు.
నిజానికి దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగే. విభిన్న మాండలికాల సమాహారంగా, కేంద్రప్రభుత్వ భాషగా ప్రచారంలోకి తీసుకువచ్చిన హిందీని అతి పెద్ద భాషగా అనుకున్నా, తర్వాతి పెద్ద భాష తెలుగే. నేటి మన రాజకీయ స్థాయి ఎలా ఉన్నా, భాషాపరంగా మనమున్న వాస్తవస్థితి అది. ఉద్యమాల నిర్వహణలో మానవీయతను మరచి అవాంఛనీయ ధోరణలను ప్రోత్సహించడం, నాయకుల దిష్టిబొమ్మలను తగులబెట్టడం - ఇదంతా ఎవరో శత్రువు పట్ల కాదు మనం చేస్తున్నది... తోటి తెలుగు అన్నదమ్ములనే మనం హీనపరచుకొంటున్నాం.
ఇంతవరకూ జరిగిన దారుణాలు, నీచ రాజకీయం చాలు... ముందు మనం అంతా ఒక భాషాజాతి అనీ, లోకం దృష్టిలో మన పరువు మర్యాదలను కాపాడుకోవాలనే స్పృహతో మన నాయకులు ప్రవర్తించాలని కోరుతున్నాం. పాలనాపరంగా రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతి భావన మనసులో ఉంటే మన మధ్య సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. సొంత అజెండాలతో ఉద్యమాలను భ్రష్టుపట్టించే వారిని దూరంగా ఉంచి, అందరూ కలసిమెలసి సమస్యల్ని పరిష్కరించుకోవడం ఒకటే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|