గౌతమి ఎక్స్ ప్రెస్ లో దోపిడి
ఖమ్మం : కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు. చైన్ లాగిన దోపిడీ దొంగలు ఆనక ఎస్ 7, 10, 15 బోగీల్లో వరుసగా ప్రయాణికుల నుంచి ఆభరణాలను దోచుకొని రైలు దిగి చీకట్లోకి పరారయ్యారు. వరంగల్ - ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని డోర్నకల్ - పాపెడిపల్లి సమీపంలోని బర్లగూడెం వద్ద ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది.
సికింద్రాబాద్ లో శుక్రవారం రాత్రి బయలుదేరిన గౌతమి ఎక్స్ ప్రెస్ లో దొంగలు ప్రయాణికుల మాదిరిగా ఎక్కారు. అర్ధరాత్రి సమయంలో వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రైలు చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. కిటికీ పక్కన ఉన్నమహిళలను దొంగలు ఆయుధాలతో బెదరించి సుమారు 57 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అయితే ఈ దోపిడీ గురించి రైల్వే పోలీసు దళాలు పట్టించుకోలేదని బాధిత ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఈ దోపిడీ సంఘటనపై విజయవాడ, రాజమండ్రి రైల్వే పోలీసు స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రయాణికులను దోచుకున్న విధానాన్ని బట్టి మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీలో సుమారు పది మంది దొంగలు పాల్గొన్నారని ప్రయాణికులు చెబుతున్నారు.
News Posted: 26 September, 2009
|