విద్యార్థులకు చిరు ఉద్బోధ
నరసాపురం : స్వార్థ రాజకీయాలకు విద్యార్థులు కీలుబొమ్మలు కావద్దంటూ ప్రజారాజ్యం పార్టీ అధినేత, వైఎన్ కళాశాల అ'పూర్వ విద్యార్థి' కొణిదెల శివశంకర ప్రసాద్ అలియాస్ చిరంజీవి ఉద్బోధించారు. సోమవారం జరిగిన వైఎన్ కళాశాల వజ్రోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉద్వేగాన్ని కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్ధపరుల చేతుల్లో విద్యార్థులు ఆయుధాలుగా మారిపోయి చివరికి సమిధలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి స్వార్ధపరుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చిరంజీవి సూచించారు.
దేశ భవిష్యత్ నిర్ణేతలు విద్యార్థులే అన్నది చరిత్ర రుజువు చేసిందని చిరంజీవి అన్నారు. భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కచ్చితమైన విశ్వాసం, కార్యాచరణతో ముందుకు సాగితే విద్యార్థులు సాధించలేనిదేదీ ఉండదన్నారు. లక్ష్యాన్ని సాధించడంలో, చిన్నప్పటి నుంచీ కన్న కలలను నిజం చేసుకోవడంలో తాను ఒక ఉదాహరణ అని చిరంజీవి చెప్పారు. విద్యార్థి ప్రస్థానం ప్రారంభమయ్యే కళాశాలలోనే సరైన దిశా నిర్దేశం అవసరమన్నారు.
నటుడైన తనను అన్ని ప్రాంతాలవారూ ఆదరించి, అభిమానించినందువల్లే మెగాస్టార్ కాగలిగానని చిరంజీవి పేర్కొన్నారు. కళాకారులను ఆదరించే సద్గుణం ఉన్న తెలంగాణ ప్రజలు తాను ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఆప్యాయంగా ఆదరిస్తారన్నారు. అయితే, కొందరు రాజకీయ నాయకులు స్వార్ధం కోసం చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సభలో పిఆర్పి ఎమ్మెల్యేలు ఈలి నాని, కన్నబాబు, పార్టీ నాయకులు కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు వైఎన్ కళాశాలతో తనకు ఉన్న అనుబంధం గురించి చిరంజీవి నెమరువేసుకున్నారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్ లకు పాల్పడవద్దని సూచించారు. అపూర్వ విద్యార్థిగా కళాశాలలో అడుగుపెట్టిన చిరంజీవిని కళాశాల యాజమాన్యం సాదరంగా ఆహ్వానించింది. ఘనంగా సత్కరించింది. పేరు ప్రఖ్యాతులతో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించేందుకు వైఎన్ కళాశాలే తనకు తొలి వేదిక అయ్యిందన్నారు. తనలాగే విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసి గొప్పవారు కావాలని విద్యార్థులను చిరంజీవి ఉత్సాహపరిచారు.
News Posted: 12 January, 2010
|