నేతలు ఒకటి, తానా రెండు
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం... పేరు ఒకటే కాని సంఘాలు రెండు. మూడు దశాబ్దాలకు పైగా అమెరికాలోని తెలుగువారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండు ముక్కలయింది. దాదాపు ఏడాది నుంచీ రెండు వర్గాలై పోట్లాడుకుంటున్న నాయకులు ఇటీవలే ఏకమైనప్పటికీ, వారి వ్యవహార శైలితో విసుగెత్తిన పలువురు సీనియర్ సభ్యులు ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) పేరుతో గత శనివారం ఏర్పడిన కొత్త యూత్ ఓరియెంటెడ్ సంఘాన్ని తెలుగులో `ఉత్తర అమెరికా తెలుగు సంఘం'గానే పిలుస్తున్నారు. ఆధిపత్య పోరాటంతో తానా పరువు ప్రతిష్ఠలను దిగజార్చిన ప్రస్తుత నాయకత్వంలోని రెండు వర్గాలనూ తూర్పార పడుతూ ఇటీవల బహిరంగ లేఖ రాసిన వ్యక్తులే ఇప్పుడు `నాట్స్'ను ఏర్పాటు చేసుకున్నారు. షికాగోలో తానా మహాసభలు జరిగే సమయంలోనే ఓర్లాండోలో నాట్స్ `అమెరికా తెలుగు సంబరాలు' పేరుతో జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇల్లినాయ్ లో శనివారం ఏర్పాటైన కార్యక్రమంలో డాక్టర్ రణకుమార్ నాదెళ్ల సంస్థ పేరును ప్రకటించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశాలను పరిష్కరించి అవసరాలను తీర్చడం నాట్స్ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. అమెరికాలోని తెలుగువారి అవసరాలు కాలానుగుణంగా మారుతున్నాయని, వాటిని గుర్తించి పరిష్కరించే బాధ్యతను నాట్స్ చేపడుతుందని చెప్పారు. అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సహాయ సహకారాలు సమర్థవంతంగా అందిస్తుందని తెలిపారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, సేవాభావం గల వ్యక్తులే సంస్థను నడిపించేలా చర్యలు తీసుకుంటామని రణకుమార్ చెప్పారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా యువతకు ప్రాధాన్యమిస్తూ, సభ్యులందరి అభిప్రాయాలనూ గౌరవిస్తూ ముందుకు సాగుతామని తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 3 March, 2009
|