నగర మేయర్ గా భానుశ్రీ
నెల్లూరు : నగర పాలక సంస్థ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 33వ డివిజన్ కార్పొరేటర్ నందిమండలం భానుశ్రీ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికలో భానుశ్రీకి మెజారిటీ వచ్చింది. కాగా, ప్రస్తుత కార్పొరేషన్ కాలంలో భానుశ్రీ రెండో మేయర్ గా వ్యవహరిస్తారు. ఇంతకు ముందు నగర పాలక సంస్థ తొలి మేయర్ పదవిలో కాంగ్రెస్ పార్టీకే చెందిన పులిమి శైలజారెడ్డి ఉన్నారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో ఏర్పడిన విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శైలజపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఆమెను మేయర్ పదవి నుంచి తొలగించింది. కొత్త మేయర్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో మంగళవారంనాడు ఎన్నిక నిర్వహించారు. అయితే, ఈ ఫలితాన్ని ప్రకటించవద్దని హైకోర్ట్ ఆదేశించడంతో భానుశ్రీ ఎన్నిక విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
కాగా, భానుశ్రీపై పోటీగా 24వ డివిజన్ కార్పొరేటర్ షాహినాబేగంను స్వతంత్ర అభ్యర్థిగా మహాకూటమి బరిలోకి దింపింది. దీనితో ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ వోటింగ్ నిర్వహించారు. కార్పొరేషన్ లో 56 మంది సభ్యులున్నారు. వారిలో 47 మంది మేయర్ ఎన్నికలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భానుశ్రీకి 30 వోట్లు రాగా, మహాకూటమి తరఫున బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి షాహినా బేగంకూ 17 వోట్లు పడ్డాయి. దీనితో నగర పాలక సంస్థ రెండో మేయర్ గా భానుశ్రీ ఎన్నికయ్యారు. మేయర్ పదవి నుంచి తనను తొలగించడం అక్రమం అంటూ శైలజారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆమె కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు. మేయర్ ఎన్నికను అనుమతించిన హైకోర్టు ఫలితాన్నితీర్పు వెలువడే వరకూ ప్రకటించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
News Posted: 4 March, 2009
|