సోలార్ సిటీకి గ్రీన్ సిగ్నల్
విజయవాడ : ఇంధన వినియోగం వల్ల నగరంలో అధికమవుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఏడాది పొడవునా మండే ఎండల ద్వారా సౌరశక్తిని సద్వినియోగం చేసుకునేందుకు సోలార్ సిటీకి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సోలార్ సిటీ పధకం కింద సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ దేశంలో 13 నగరాలు ఎంపిక చేయగా, రాష్ట్రంలో ఒక్క విజయవాడనే ఎంపిక చేసినట్లు కమీషనర్ పి.ఎస్ ప్రద్యుమ్న విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ మేరకు 50 లక్షల రూపాయల ఫండింగ్ కూడా మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. బ్రిటీష్ హై కమిషన్ అంతర్జాతీయంగా ఎనర్జీ కేవింగ్స్, కాలుష్య నివారణ వంటి అంశాలపై సర్వే నిర్వహిస్తోంది. భారతదేశంలో కూడా అర్బన్ బాడీలలో సర్వే నిర్వహిస్తోంది. విజయవాడ నగరంలో కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్వైర్ మెంటల్ ఇనిషియేట్ (ఇక్లాయ్) అనుబంధంగా సర్వే నిర్వహించింది. ఏడాదిన్నర క్రిందటే కార్పొరేషన్ అధికారులతో ఈ సంస్థ తమ ఆసక్తిని వెళ్ళబుచ్చింది. దీనికి కార్పొరేషన్ కూడా పచ్చ జెండా ఊపటంతో సిటీ ఎనర్జీ స్టేటస్ రిపోర్టుకు మార్గం సుగమమైంది. గురువారం ఈ సంస్థ కార్పొరేషన్ కు తాము జరిపిన అధ్యయనానికి సంబంధించి సిటీ ఎనర్జీ స్టేటస్ రిపోర్టును అప్పగించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పధకమైన సోలార్ సిటీకి కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇక్లాయ్ వంటి సంస్థ నగరంలో జరిపిన నివేదికను, నగరంలో కొద్ది సంవత్సరాలుగా చేపడుతున్న ఎనర్జీ సేవింగ్ సిస్టమ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం సోలార్ సిటీకి బెజవాడను ఎంపిక చేసింది.
News Posted: 12 June, 2009
|