జిల్లా సింగిల్ డిజిట్లో ఉండాలి
(వేముల సదానందం)
వరంగల్ : ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలో రాష్ట్రంలో జిల్లాను మొదటి పదిస్థానాలలో ఉండేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ కోరారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తన చాంబర్ లో ఆయన అధికారులతో సమీక్షించారు. గృహనిర్మాణంలో జిల్లా 18వ స్థానంలో ఉండటానికి కారణాలను స్పషంగా తెలిపితే వాటి ద్వారా పరిష్కారానికి సరైన మార్గాలను ఎంచుకుని ముందుకు సాగవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు జిల్లాలో అధికంగా మంజూరి, సెంట్రింగ్ మెటీరియల్, తాపీ మేస్త్రీలు దొరకకపోవడం కారణాలు గృహనిర్మాణాధికారులు కలెక్టర్ కు వివరించారు. వరంగల్ పట్టణ ప్రాంతంలో 60 ఎకరాల భూమి సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ భూమి సేకరణకు ఆలస్యం జరుగుతుందని దీనికి బదులు అసైన్డ్ భూమి ఇచ్చుటకు లబ్దిదారులతో చర్చించాలని అన్నారు. జనగాం ప్రాంతంలో భూ సేకరణకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారని కలెక్టర్ ఆదేశించారు.
బ్రిడ్జి రుణాల గురించి కలెక్టర్ మాట్లాడుతూ ఏఏ బ్యాంకు కింద ఎంత మొత్తంలో బ్రిడ్జి రుణాలు రావాల్సిందో అంచనా వేయాలన్నారు, తదుపరి ఆయా బ్యాంకుల నియంత్రణా అధికారులతో మాట్లాడి బ్రిడ్జి రుణాలు మంజూరికి కృషి చేస్తానని అన్నారు. దీనికి గృహ నిర్మాణం, ఇందిరా క్రాంతి పథం వారు పరస్పర సహకారంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, ట్రైనీ కలెక్టర్ వినయ్ చంద్, సబ్ కలెక్టర్ సువర్ణపాండాదాస్, రెవెన్యూ డివిజనల్ అధికారులు శ్రీనివాస్, శుకృనాయక్, వినయ కృష్ణారెడ్డి, డిఆర్ డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర్ చౌదరి, హౌసింగ్ ప్రత్యేక అధికారి విజయ గోపాల్, జిల్లా మేనేజర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 22 June, 2009
|