డిఎస్సీ గణితంలో లక్ష్మీ టాప్
విజయవాడ : కృషి, పట్టుదల ఉంటే విజేతలు ఎక్కడి నుంచో రారని వారు మన మధ్యలోనే ఉండి విజయాలను సాధిస్తారన్న సూక్తిని నిజం చేస్తూ లక్ష్మీ దుర్గ డిఎస్సీ ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మీదుర్గ గణితంలో బీఈడీ అసిస్టెంట్ గా డిఎస్పీ రాసి ఫలితాల్లో 82.5 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. చనుబండ గ్రామానికి చెందిన నిరుపేద దర్జీ వెంకటేశ్వరరావు కుమార్తె ఈమె. లక్ష్మీ ఉన్నత విద్యను చనుబండలో చదివి, ఇంటర్ విస్సన్నపేటలో, గుంటూరు జిల్లా రేపల్లిలో డిగ్రీ చేసింది. బీఈడీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 164 ర్యాంక్ సాధించి హైదరాబాద్ లో బీఈడీ పూర్తి చేసింది. దర్జీగా జీవిస్తున్న వెంకటేశ్వరారవు ఇతరత్రా ఆస్తులు లేకపోయినా కష్టపడుతూ తన పిల్లలను చదివిస్తున్నాడు. ఉపాధ్యాయ వృత్తి తనకు ఎంతో ఇష్టమని లక్ష్మీదుర్గ పేర్కొంటూ దూరవిద్యలో ఎమ్మెస్సీ చేయాలనే అభిలాషను వ్యక్తం చేసింది.
News Posted: 3 July, 2009
|