108 లీటర్లతో పాలాభిషేకం
విజయవాడ : నాగమ్మ సత్రం వెనుగుభాగంలో ఉన్న శ్రీదేవీ లలితాంబికా అమ్మవారికి సహస్ర కలశాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు అమ్మవారి జన్మదినం కూడా కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదీ తీరం దుర్గాఘాట్ నుంచి తీసుకువచ్చిన నదీ జలాలతో రధం సెంటర్, చిట్టినగర్, బ్రాహ్మణవీధి, కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్, లంబాడీ పేట మీదుగా సాగిన సహస్ర కలశాల శోభాయాత్ర అనంతరం పీఠానికి చేరుకుని జలాలతో పాటు 108 లీటర్ల పాలాభిషేకం, పన్నీరు, పళ్ళరసాలు, పంచామృతాలతో అభిషకాలు చేశారు. ఉత్సవ మూర్తిని పురవీధిల్లో ఊరేగించారు. పీఠాధీశ్వరి శివలీల మాతాశ్రీ ముత్తైదువులకు, సుహాసినీలకు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, తాంబూలాలను అందజేశారు. ఖడ్గమాల దేవతాస్తుతి సీడీలను మాతాశ్రీ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 54 రోజుల అమ్మవారి దీక్షలను ప్రారంభించారు. సెప్టెంబర్ 28వ తేదీ విజయ దశమితో ఈ దీక్షలు ముగుస్తాయని పీఠం కన్వీనర్ తెలిపారు.
News Posted: 6 August, 2009
|