హాస్టల్ పై నుండి దూకిన విద్యార్థి
విజయవాడ : ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న లోహితా రెడ్డి హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న లోహితా రెడ్డి బుధవారం కళాశాల భవనం ఐదో అంతస్తు పైనుంచి దూకింది. దాంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది లోహితారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన లోహితారెడ్డి ఇక్కడ చదువుకుంటోందని సహ విద్యార్థులు తెలిపారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, చదవడం కష్టంగా ఉండడంతో ఆత్మహత్యకు పూనుకుంటున్నట్లు లోహితారెడ్డి సూసైడ్ నోట్స్ లో రాసుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 12 August, 2009
|