విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గర్భగుడిలో వేదికపై కొలువై ఉన్న దుర్గమ్మవారికి ఆచ్ఛాదనగా ఉన్న మకరతోరణం స్వర్ణమయం కానుంది. దసరా ఉత్సవాల నిర్వహణపై సమీక్షించేందుకు సతీసమేతంగా వచ్చిన సుందర్ కుమార్ కనకదుర్గమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అర్చన అనంతరం మకరతోరణం వెలవెలబోతున్న విషయాన్ని ఆయన గమనించారు. దసరా ఉత్సవాలు త్వరలో రానుండడంతో మకరతోరణం మరింతగా మెరుగు పరిచాలన్న ఉద్దేశ్యంతో ఇవో గోపాలకృష్ణారెడ్డితో చర్చించారు. ఇందుకు కాలవసిన ప్రతిపాదనలు పంపాలని ఈవోను సుందర్ కుమార్ ఆదేశించారు. దుర్గమ్మవారికి కనకదుర్గ అనే నామం ఉండడంతో ఆమె చుట్టూ అంతా కూడా కనకమయంగా ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వారాన్ని కూడా స్వర్ణమయం చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు.