సర్వారాయ పురస్కారాలు
రాజమండ్రి : మే 2న కపిలేశ్వరపురంలో సర్వారాయ సంస్థానం ఆధ్వర్యంలో అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ కు, ప్రముఖ గాయనీ, నటి, నిర్మాత సి.కృష్ణవేణికి సర్వారాయ పురస్కారాలు అందజేయనున్నారు. సాహితీ, లలిత కళా పురస్కారాలకు గాను ఈ సంవంత్సరం వీరిద్దరిని ఎంపిక చేసినట్లు సర్వారాయ ఛైర్మన్ ఎస్ బిపిబికె సత్యనారాయణరావు విలేఖరుల సమావేశంలో అవార్డు విశేషాలను తెలిపారు. కపిలేశ్వరపురం జమీందార్ ఎస్ బిపిబికె సత్యనారాయణరావు తల్లి పేరున లక్ష్మీసర్వారాయ సాహితీ పురస్కారం, తాతమ్మ రామలక్ష్మమ్మ పేరున లలిత కళాపురస్కారాలను 1992 నుండి ప్రారంభించారు. అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం మే 2న కపిలేశ్వరపురంలో సర్వారాయ సంస్థానంలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూనే వున్నారు. ఎందరో ప్రముఖులు ఈ సంస్థానం నుండి అవార్డులను పొందారు. ఈ ఏడాది రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత సి.కృష్ణవేణికి లలిత కళా పురస్కారం, నటరత్న ఎన్.టి.ఆర్ జాతీయ అవార్డు గ్రహీత ఆవంత్స సోమసుందర్ కు సాహితీ పురస్కారం ఇచ్చేందుకు కమిటీ నిర్ణయించింది. ఈ వేడుకకు కళాభిమానులు, సాహితీ ప్రియులు విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమానికి నన్నయ్య వర్సిటీ వైస్ చాన్సలర్ కందుల నిరుపరాణి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
News Posted: 1 May, 2009
|