మురళి కుటుంబాన్ని ఆదుకుంటాం
హైదరాబాద్ : కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొబ్బూరి మురళీకృష్ణ యాదవ్ హత్యను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సోమవారంనాడు పార్టీ కార్యాలయం విడుదల చేసిన మీడియా ప్రకటనలో చంద్రబాబు ఈ ఖండన చేశారు. మురళీకృష్ణ యాదవ్ ను ఆదివారం ఉదయం కాంగ్రెస్ వర్గీయులే దారుణంగా హతమార్చారని ఆయన ఆరోపించారు. ఇటీవలి ఎన్నికల్లో మురళీకృష్ణ యాదవ్ తమ పార్టీ తరఫున క్రియాశీలక పాత్ర పోషించడంతో సహించలేని వారు ఇంతటి దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళికి ప్రాణ హాని ఉన్నదని పోలీసులు ముందుగానే హెచ్చరించడంతో కొంత కాలంగా చాపాడు మండలం మడూరులో ఉంటున్నాడన్నారు. హెచ్చరించిన పోలీసులు మురళి కోసం ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మురళి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. మురళి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మురళి కుమారుడు సుమంత్, కుమార్తె సుజాత విద్య, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయంగా ఉంటామన్నారు. మురళి కుటుంబానికి చంద్రబాబునాయుడు సానుభూతిని ప్రకటించారు.
News Posted: 1 June, 2009
|