స్వగ్రామానికి ఎన్నారై మృతదేహం
కడప : తొమ్మిది రోజులుగా లండన్ లో చిక్కుకుపోయిన హేమసుందర్ రాజు మృతదేహం ఎట్టకేలకు అతని స్వగ్రామం చేరుకున్నది. కడప జిల్లాలోని మారుమూలలో ఉన్న కోనేటివాండ్ల పల్లికి చెందిన హేమసుందరరాజు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్ళాడు. అయితే, బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కారణంగా హేమసుందర్ రాజు అక్కడే మరణించాడు. కొండూరి పిచ్చిరాజు, లీలావతిల కుమారుడు హేమసుందర్ రాజు. మృతదేహాన్ని భారతదేశానికి పంపించేందుకు బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు ఏవో సాంకేతిక కారణాలతో తొమ్మిది రోజులుగా అక్కడే ఉంచుకున్నారు.
ఇలాంటి స్థితిలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్నారై శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చొరవ, ముఖ్యమంత్రి పేషీ పట్టు వల్ల హేమసుందర్ రాజు బంధువులకు మృతదేహాన్ని అప్పగించేందుకు బ్రిటన్ అధికారులు అంగీకరించారు. లండన్ లోని తెలుగు సంఘం ప్రతినిధుల కృషి కూడా హేమసుందర్ రాజు మృతదేహం స్వగ్రామం చేరడానికి బాగా ఉపకరించింది.
ఎంతో ప్రతిభావంతుడైన విద్యార్థిగా హేమసుందరరాజు మంచి పేరు తెచ్చుకున్నాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకుని జీవితంలో ఉన్నత స్థానం చేరే సమయంలో రాజు ఇలా అకాలంలో మృత్యువాత పడడం గ్రామస్థులను కలచివేసింది. ముఖ్యంగా రాజు తల్లిదండ్రుల శోకం వర్ణనాతీంగా ఉంది.
News Posted: 22 June, 2009
|