గ్రూప్-1 టాపర్ కి సన్మానం
కడప : మనలో ప్రతిభాపాటవాలు ఉంటే ఏ రంగంలోనైనా సమర్థవంతంగా రాణించవచ్చని ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగం కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే రాదనీ, మనలో శక్తి సామర్థ్యాలు ఉంటే అవి మన సొంతం అవుతాయన్నారు. ఖాజీపేట బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థులైన ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డిని, గ్రూప్ -1 టాపర్ వెంకటమురళిని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ విద్యార్థి దశే కీలకమని, ఓటమితో నిరాశ చెందకుండా నిరంతరం లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి విజ్ఞానాన్నిపెంచే వివేకానంద, గాంధీజీ, అబ్దుల్ కలాం రాసిన పుస్తకాలు చదవడం ద్వారా స్ఫూర్తి పొందవచ్చన్నారు. సెల్ ఫోన్లు, సినిమాలు, ప్రేమ వంటి ఆకర్ణషణలకు లోను కాకుండా ఉన్నత విద్యను అభ్యసించేందుకు కృషి చేస్తే తప్పక గెలుపు మన సొంతం అవుతుందన్నారు. తదుపరి పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన తిరుపాల్ రెడ్డి, ఈశ్వరీ అనే విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గ్లాడియస్ పరిమళ, ఎంపీడీఓ సమత, ఉప మండలాధ్యక్షుడు కరీముల్లా హెచఎం అలీవేలు, తదితరులు పాల్గొన్నారు.
News Posted: 30 June, 2009
|