జనాభా గణనకు శ్రీకారం
కాకినాడ : జాతీయ జనాభా రిజిస్టర్ తయారీకి జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన తహసిల్దార్లు, వీఆర్వోలు, ఎన్యూమరేటర్లకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది కలెక్టరేట్లోని బెన్నెట్ క్లబ్ లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని, పదిహేనేళ్ళు దాటిన వారి ఫొటోగ్రాఫ్, వేలిముద్రలతో కూడిన జాతీయ జనాభా రిజిస్టర్ తయారీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. వీఆర్వోలు, పంచాయితీ అధికారుల సహకారంతో జాతీయ జనాభా రిజిస్టర్ ఆవశ్యకత గురించి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం సాగించాలన్నారు. తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుగా తీర ప్రాంతాల గ్రామాలలో నివసిస్తున్న వారికి గుర్తింపుకార్డులను ఇవ్వడం ద్వారా జాతీయ జనాభా రిజిస్టర్ కు శ్రీకారం చుట్టిందన్నారు.
News Posted: 2 September, 2009
|