వికలాంగులకు ఫెన్షన్లు
నిజామాబాద్ : జిల్లాలోని సుమారు 30 వేలమంది వికలాంగులకు 1.5 కోట్ల రూపాయల పెన్షన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య విద్యా శాఖామంత్రి పి.సుదర్శన్రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద గల స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో ఐకెపి ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్ళు, చెవిటి మిషన్లు, గుడ్డివారికి చేతి కర్రలను పంపిణీ చేశారు. డిఆర్డిఎ, ఐకెపి, రాజీవ్ విద్యామిషన్, వైద్య ఆరోగ్యశాఖ, వికలాంగుల శాఖ, స్వచ్చంద సంస్థల అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు అప్పటివరకు చెల్లిస్తున్న ఫెన్షన్లను రూ.75 నుండి 500 వరకు పెంచిందని, ఇది వారి జీవనోపాధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఇందిరమ్మ పథకంలో ఇంకా ఇండ్లు మంజూరు కాని వికలాంగులు 3వ విడతలో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు లాగే ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్న లబ్దిదారులకు ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని ఆయన తెలిపారు. ఎవరికైనా ఇంకా ఫెన్షన్ అందకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ వెంకటరమణారెడ్డి, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్రెడ్డి, మండవ వెంకటేశ్వర్రావు, యెండల లక్ష్మినారాయణ మాట్లాడారు. శాసనసభ్యులు హనుమంతు షిండే, జిల్లా సహకార బ్యాంక్ చైర్మెన్ రాజిరెడ్డి, జాయింట్ కలెక్టర్ జగన్నాథం, ఐకెపి పిడి మధుకర్బాబు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 24 September, 2009
|