మంటల్లో పంజాబ్ జాతీయ బ్యాంక్
కర్నూల్ : పంజాబ్ జాతీయ బ్యాంక్లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో బ్యాంక్లోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఏటీఎంలు కాలి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున ఈ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగివుంటుందని ఇంఛార్జి మేనేజర్ చరణ్ బాబు తెలిపారు. ఏటీఎం డబ్బు మాత్రం సురక్షితం అని ఆయన అన్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాంక్ గదుల నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ బ్యాంక్ లో కంప్యూటర్లు ప్రధాన కార్యాలయంతో అనుసంధానం చేయడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి సమస్యా ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేసిన ప్రయత్నం వల్ల ఖజానా గదికి మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.
News Posted: 16 November, 2009
|