5 నుంచి నాటకోత్సవాలు
ఏలూరు : కళలకు కాణాచి అయిన భీమవరంలో సందేశాత్మక నాటకోత్సవాలు 5వ తారీకు నుంచి ప్రారంభం కానున్నాయి. అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళాపరిషత్ 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో అవార్డులు సాధించిన నాటికలు ప్రదర్శనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులు విచ్చేయడమే కాక ప్రముఖ రంగస్థల కళాకారులకు సత్కారాలు నిర్వహించనున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లూరి సీతారామారాజు సంగీత నాటక కళాపరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు మాట్లాడుతూ ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకూ నాటకోత్సవాలు జరుగుతాయన్నారు. వీటిని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభిస్తారని, మున్సిపల్ చైర్పర్సన్ తోట సీతారామలక్ష్మి జ్యోతిప్రజ్వలన చేస్తారని చెప్పారు. డిఎన్ఆర్ కళాశాల సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంతర్ విశ్వవిద్యాలయాల్లో ప్రథమ బహుమతి సాధించిన పోరాటం, బంగారుబిడ్డ నాటికలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారులు ఎంవి.రామారావును సత్కరించనున్నట్లు తెలిపారు.
6 వ తేదీన న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ (విజయవాడ) ఆధ్వర్యంలో పిపీలికం, రజరంజని వెలుగులో చీకటి, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణార్జునుల యుద్ధ సన్నివేశం, 7 వ తేదీన మహాత్మాజ్యోతీరావు ఫూలే నాటికలు ప్రదర్శన జరుగుతాయన్నారు. గంతోత్రి పెదకాకాని వారి దగ్ధ దృశ్యం ప్రదర్శన జరుగుతుందన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారులు, సినీనటుడు రాళ్ళపల్లిని ఘనంగా సత్కరిస్తామన్నారు. ఈ నాటకోత్సవాలకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శ్రీ శాఖామంత్రి పితాని సత్యనారాయణ, నర్సాపురం ఎంపీ కనుమూరు బాపిరాజు, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో పరిషత్ కార్యదర్శి ఆరేటి ప్రకాష్, సలహాదారు మెంటే పార్థసారథి, కోశాధికారి పొత్తూరి ఆంజనేయరాజు పాల్గొన్నారు.
News Posted: 3 December, 2009
|