'వెంగమాంబ' రివ్యూ
భూలోకంలో స్వార్థం నానాటికీ పెరిగిపోతుండటంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలోచనలో పడతారు. అది గమనించిన పద్మావతి దేవి ప్రజలను భక్తిమార్గంలో పెట్టేందుకు ఆళ్వారులు, అన్నమయ్యను పంపిన శ్రీవారు ఈసారి తనకు అవకాశమివ్వమని కోరుతుంది. ఆ వరాన్ని ఆయన అనుగ్రహిస్తారు. పద్మావతి దేవి అంశంతో తాళ్లపాక గ్రామంలో పిల్లల కోసం తపిస్తున్న కృష్ణయ్య (శరత్ బాబు), మంగమ్మ (సుధ) అనే బ్రాహ్మణ దంపతుల ఇంట (కానాల వారి వంశం) వెంగమాంబ (మీనా) జన్మిస్తుంది. చలనమే లేని ఆ పసిగుడ్డును చూసి తల్లిదండ్రులు కలత చెందుతారు. ఓ సాధువు వచ్చి చెవిలో శ్రీ వేంకటేశ్వర నామం చెప్పడంతో వెంగమాంబ కిలికిలలాడుతుంది. బాల్యంలో అడుగుపెట్టిన వెంగమాబం ఆ వేంకటపతే తన తన విభుడని చెప్పడంతో కంగారు పడిన తల్లితండ్రులు ఆ ప్రాయంలోనే ఇంజేటి వంశస్థుడైన వేంకటాచలపతి అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. యవ్వనంలోకి అడుగుపెట్టిన వెంగమాంబకు శోభన ముహూర్తాన్ని పెద్దలు నిశ్చయిస్తారు. తాను ఆ వేంకటపతికే అంకితమని చెప్పిన వెంగమాంబ మాటను పెడచెవిన పెడతారు. శోభనం రోజున వెంగమాంబలో చౌడీశ్వరీ దేవిని చూసిన భర్త ఆ దేవతను స్త్రోత్రం చేసి దూరంగా ఉండిపోతాడు. దీంతో వేంకటాచలపతికి మరో వివాహం చేయాలని అతని తల్లితండ్రులు భావిస్తారు. ఆ ప్రతిపాదనకు వెంగమాంబ ఒప్పుకోదు. ఆమె ఆలోచన సరైనదేనని ఆ తర్వాత క్రమంలో నిరూపితమవుతుంది. కొద్దిరోజులకే కాలంతీరి భర్త కన్నుమూస్తాడు. ఆసరికే వైధవ్యం, భర్త పోయిన స్త్రీలకు కట్టు-బొట్టు తీసివేయడంపై తిరుగుబాటు చేసిన వెంగమాంబ తాను జీవించి ఉన్నంతకాలం పుట్టుకతో వచ్చిన అలంకారణాలను తీసేది లేదని తేల్చిచెబుతుంది. ఇది అగ్రహార బ్రాహ్మలకు కన్నెర్ర అవుతుంది. ఆ పరిస్థితిని వెంగమాంబ సమర్ధవంతంగా ఎదుర్కోవడం, ఆ తర్వాత గురువు వద్ద దీక్ష తీసుకుని బ్రహ్మజ్ఞాన విద్యను ఆకలింపు చేసుకుని కవయిత్రిగా మారడం, ఆ తర్వాత మజిలీగా తిరుపతి శ్రీవారి చెంతకు చేరి తన జన్మను సార్థకం చేసుకోవడం మిగతా కథాంశం.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|