చందు (గోపీచంద్) ఆస్ట్రేలియాలో తన మామయ్య కృష్ణారావు (చంద్రమోహన్) దగ్గర ఉంటూ లైఫ్ ను హ్యాపీగా గడిపేస్తుంటాడు. తనకు ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి మేనల్లుడికైనా పెళ్లి చేయాలని కృష్ణారావు తెగ తాపత్రయపడుతుంటాడు. ఈ క్రమంలో తెలుగమ్మాయి మహాలక్ష్మి (త్రిష) చందుకు తారసపడుతుంది. మహాలక్ష్మి తన అంకుల్ (ధర్మవరపు) నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్ 'ఆంధ్ర మిర్చి'ని చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు చందు మహాలక్ష్మిని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. మొదట్లో అతని లవ్ ప్రపోజల్స్ ను మహాలక్ష్మి తిప్పికొట్టినప్పటికీ క్రమంగా చందు పట్ల ప్రేమ కలుగుతుంది. ఆ విషయం చెప్పాలనుకునేసరికి ఆమె అత్త (తెలంగాణ శకుంతల) సీన్ లోకి వచ్చి మహాలక్ష్మిని బలవంతంగా ఇండియా తీసుకువచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి కడపలో అడుగుపెడతారు. మహాలక్ష్మి తండ్రి పశుపతి (కోట) ఓ ఫ్యాక్షన్ లీడర్. పక్క గ్రామంలో ప్రజలంతా దేవుడుగా కొలిచే శివయ్య (సత్యరాజ్) అతని ప్రధాన ప్రత్యర్థి. మహాలక్ష్మి కోసం కడపలో అడుగుపెట్టిన చందును పశుపతి తనవైపు తిప్పుకుంటాడు. శివయ్యను అంతం చేసేందుకు ఒక ఆయుధంగా ప్రయోగిస్తాడు. ఈ క్రమంలోని శివయ్య మరెవరో కాదనీ తన తండ్రేనని చందు తెలుసుకుంటాడు. అసలు తండ్రికి దూరంగా చందు ఇంతకాలం ఎందుకు ఉండాల్సి వచ్చింది? పశుపతి-శివయ్య మధ్య ఫ్యాక్షన్ వార్ కు ముగింపు ఏమిటనేది మిగతా కథ.