'ఈనాడు' రివ్యూ
బుద్ధవిగ్రహం సాక్షిగా ట్యాంక్ బండ్ పై పోలీస్ కమిషనర్ అంతర్మథనంతో అసలు కథ మొదలవుతుంది. నిజానికి నిన్నటి వరకూ ఆయన పోలీసు కమిషనరే. ఈ రోజు ఓ సగటు మనిషి. 'సునామీలా వచ్చి నా జీవితాన్ని తలకిందులు చేసిపోయాడు...ఆరోజు ఈరోజులా ఓ మామూలు రోజే...'అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళతాడు. 'ఒక సాధారణ వ్యక్తి ఆకాశమంత ఎదిగి వ్యవస్థనే ఎదుర్కొన్నాడంటే అతనెంత నిజాయితీపరుడో అర్ధమవుతుంది. అందుకే నేను నా జాబ్ వదులు కోవడమే మంచిదనిపించింది. ఈ రోజు నేను కూడా సాధారణ మనిషినే. మరింత పవర్ ఫుల్' అంటూ కమిషనర్ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. కమిషనర్ ను అంతగా కదిలించిన ఆ కామన్ మెన్ కథా కమామిషులోకి వెళితే...
పోలీసు కమిషనర్ ఈశ్వర ప్రసాద్ కు (వెంకటేష్) ఓ అజ్ఞాత వ్యక్తి (కమల్ హాసన్) నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నగరంలోని ఐదు పబ్లిక్ ప్లేస్ లలో ఆర్ డిఎక్స్ పేలుడు పదార్ధాలు ఉంచాననీ, సరిగ్గా సాయంత్రం 6 గంటల కల్లా అవి పేలబోతున్నాయని చెబుతాడు. వెంటనే కమిషనర్ పోలీస్ డిపార్ట్ మెంట్ ను అప్రమత్తం చేసి ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీ (లక్ష్మి)కి ఆ విషయం తెలియజేస్తాడు. ప్రజల్లో భయాందోళనలు చెలరేగకుండా సున్నితంగా ఆ సమస్యను హ్యాండిల్ చేసే బాధ్యతను ఈశ్వర ప్రసాద్ కు అప్పజెబుతారు. పేలుడు పదార్ధాల నుంచి సిటీని కాపాడటం, అజ్ఞాత వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడం దిశగా అశ్వర్ ప్రసాద్ పావులు కదుపుతుంటాడు. ఎప్పటికప్పుడు అజ్ఞాత వ్యక్తి చేసే కాల్స్ ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో పోలీస్ స్వాడ్స్ తో ముమ్మరంగా తనిఖీలు చేయిస్తాడు. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల సంఘటనలో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు తీవ్రవాదులను విడిచిపెడితే ఆర్ డిఎక్స్ ఎక్కడ ఉంచిందీ చెబుతానని ఆ అజ్ఞాత వ్యక్తి డిమాండ్ చేయడంతో కమిషనర్ సొంత రిస్క్ తీసుకుని వివిధ జైళ్లలో ఉన్న ఆ నలుగురు తీవ్రవాదులను అతను చెప్పిన చోటికి పంపుతాడు. ఆ అజ్ఞాత వ్యక్తి అసలు మిషన్ ఏమిటి? తీవ్రవాదులతో అతనికున్న సంబంధం ఏమిటి? కమిషనర్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయిందా? అనేవి ఆసక్తికలిగిస్తూ క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|