గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరిలో అందరికీ ఒకడే వైద్యుడు. అలాగని అతను ఎంబిబిఎస్ కాదు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషియన్ (ఆర్.ఎం.పి.). ఇంటిపేరు బెండు. ఒంటిపేరు అప్పారావు. వెరసి బెండు అప్పారావు. అతని క్లినిక్ పేరు సంజీవిని. తన తెలివితేటలే పెట్టుబడిగా వైద్యం చేసేస్తుంటాడు. రోగం చిన్నదే అయినా, అసల రోగమే లేకపోయినా కూడా జనాల్ని తన పేషెంట్లుగా చేసేస్తూ డబ్బులు గుంజేస్తుంటాడు. డబ్బుల కోసం ఇంత కక్కూర్తి పడటానికి దురాశాపరుడైన తన చెల్లెలి భర్తే (కృష్ణ భగవాన్) కారణం. ఆ ఊళ్లో బొబ్బర్లంక సాయి సూర్యనారాయణ రాజు (ఆహుతి ప్రసాద్) అనే ఆసామి ఉంటాడు. ఆ రాజుగారమ్మాయి పద్మ (కామ్న జెఠ్మలాని) అప్పారావు ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరి ప్రేమా ఇలా సాగుతున్న తరుణంలో 15 లక్షల రూపాయల సొమ్ము అప్పారావు చేతికి వస్తుంది. దానిని సంబంధిత వ్యక్తులకు అందజేసే బాధ్యత అతనిపై పడుతుంది. అక్కడ్నించే కథ మలుపు తిరుగుతుంది. అప్పారావు జీవితంలోకి ఓ స్కూలు టీచర్ (మేఘన) అడుగుపెడుతుంది. అసలు ఆమె ఎవరు? అప్పారావు ఆ 15 లక్షల సొమ్ము ఏమి చేశాడు? పద్మతో అతని ప్రేమాయణం చివరకు సుఖాంతమైందా? వంటివి తెరపై చూస్తేనే నవ్వుకోగలం.