'మాయాబజార్' రివ్యూ
అర్జునుడు-సుభద్రల తనయుడైన అభిమన్యుడు, బలరాముడు-రేవతి దంపతుల కుమార్తె శశిరేఖ ఆటపాటల రోజుల నుంచి ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుంటారు. పాండవులు రాజసూయ యాగంతో భోగభాగ్యాలతో తులతూగుతున్న రోజుల్లో బలరాముడు తన సోదరి అయిన సుభద్రను వరం కోరుకోమన్నప్పుడు శశిరేఖను తన కోడలిని చేస్తే చాలని ఆమె అంటుంది. బలరామ దంపతులు ఎంతో సంతోషంగా సరేనని మాట ఇస్తారు. ఆ తర్వాత క్రమంలో పాండవులు కౌరవుల మాయాజూదంలో ఓడిపోయి సర్వం కోల్పోతారు. అభిమన్యుడితో కలిసి పుట్టింటికి వచ్చిన సుభద్రకు అక్కడ అవమానాలు ఎదురవుతాయి. శకునితో కలిసి దుర్యోధనుడు పన్నిన వ్యూహంలో చిక్కుకున్న బలరాముడు తన కుమార్తె శశిరేఖను దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. శశి అభిమన్యుడిదేనని చిన్నప్పుడే మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతావా అని బలరాముని సుభద్ర నిలదీస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చిన మాట...నిండు సభలో దుర్యోధనుడికి ఇచ్చిన మాటా ఒకటేనా అని రేవతి తెగేసి చెప్పడంతో సుభద్ర పుట్టెడు దు:ఖంతో తిరుగుముఖం పడుతుంది. శశిరేఖ మనసెరిగిన ఆమె చిన్నాన్న శ్రీకృష్ణుడు రంగలోకి దిగుతాడు. శ్రీకృష్ణుని సూచనల మేరకు శశి-అభిమన్యులకు వివాహం చేసి కౌరవ దుష్టచతుష్టాయానికి (దుర్యోధనుడు, శకుని, దుశ్శాశనుడు, కర్ణుడు) శృంగభంగం కలిగించే బాధ్యతను భీమసేన-హిడింబిల తనయుడైన ఘటోత్కచుడు చేపట్టి కథను సుఖాంతం చేస్తాడు.
సినిమా అంతా పాండవుల ప్రసక్తి ఉన్నా ఎక్కడా పాండవులను చూపకపోవడం ఈ చిత్రంలోని ఓ ప్రత్యేకత. రాక్షసమాయ, టక్కుటమార విద్యలు, వీటిని వినోదం మేళవించి రూపకల్పన చేయడం ద్వారా కె.వి.రెడ్డి ఈ చిత్రాన్ని జనరంజకం చేశారు. ఇప్పటి రంగుల ప్రక్రియ విషయానికి వస్తే కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్ మోహన్ తగినంత నిబద్ధతతో చేసిన ప్రయత్నంగా ఈ చిత్రాన్ని చెప్పొచ్చు. అయితే నెగిటివ్ 60 శాతానికి పైగా దెబ్బతినడం వల్లనే ఏమో కానీ అక్కడక్కడా కలర్ డల్ గా అనిపిస్తుంది. అయితే లాంగ్ షాట్స్ కంటే షార్ట్ షాట్స్ చాలా చక్కటి కలర్ ప్రోసెసింగ్ తో కనిపిస్తాయి. 'మాయాబజార్' చిత్రం అప్పట్లో అంత ఘన విజయం సాధించడంలో అందులోని పాటలది కూడా ప్రధాన పాత్రే. కలరైజేషన్ ప్రక్రియలోకి వచ్చేసరికి సినిమాలోని హిట్ సాంగ్స్ లో ఒకటైన 'భళి భళి భళి దేవా..బాగున్నదయా నీమాయ' ను తొలగించేశారు. గోపీనాథ్, పసుమర్తి కృష్ణమూర్తి నేతృత్వంలో రూపొందిన చిన్ని కృష్ణుని నృత్యరూపకం 'విన్నావ యశోదమ్మా...నీ చిన్ని కృష్ణుని అల్లరి చిల్లరి పనులు' పాటపై కూడా మూడొంతులకు పైగా వేటు పడింది. పల్లవి..ముగింపుతో అర్థాంతరంగా పాట ముగిసిపోయింది. ఇదే పరిస్థితి మరో పాటకు ఎదురైంది. ద్వాపరలో పెళ్లికి విచ్చేసిన దుర్యోధనాదులకు స్వాగతం పలుగుతూ వచ్చే 'దయచేయండి దయచేయండి...తమంత వారిక లేరండీ' పాట కూడా బిట్ సాంగ్ తరహాలో ముగిసింది. నిజానికి టైటిల్ పరంగా చూసినప్పుడు ఆ పాటకు ఉండే ప్రాధాన్యం తేలిగ్గా తీసేయలేం. నిడివి తగ్గించడంలో భాగంగానో, నెగిటివ్ బాగా చెడిపోయి కలర్ ప్రోసెసింగ్ కు సాధ్యం కాకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండొచ్చు. కలర్ ప్రింట్ లో వచ్చిన తొలి కాపీని తిలకించి సినిమా రిలీజ్ కు ముందే కన్నుమూసిన బలరామ పాత్రధారి గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఈ చిత్రాన్ని అంకిత మిస్తున్నట్టు సూపర్ గుడ్ అధినేతలు చెప్పినప్పటికీ టైటిల్ కార్డ్స్ లో వేయడంకానీ, వాయస్ ఓవర్ లో చెప్పడం కానీ చేయలేదు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|