రమేష్ అలియాస్ రమ్మీని (నాగార్జున) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శేఖర్ రామ్ శెట్టి (సాయాజీ షిండే) చేసే ఇంటరాగేషన్ కథను మూడొంతలు నడిపిస్తుంది. ఈ ఇంటరాగేషన్ లోనే రమ్మీ గుంటూరు నుంచి విజయనగరం...హైదరాబాద్...గోవా వరకూ చేసిన ఛీటింగ్ వ్యవహారాల జర్నీ సాగుతుంటుంది. అంటే...బిట్లు బిట్లుగా ఫ్లాష్ బ్యాక్ పంథాలో కథ సాగిపోతుందన్న మాట. చిన్నతనంలో పెరిగిన వాతావరణం రమ్మీపై ప్రభావం చూపుతుంది. ఆ వయసులోనే జానకితో ప్రేమలో పడతాడు. నాతో వచ్చేయ్..నేను చూసుకుంటానంటాడు రమ్మీ. ముందు బాగా డబ్బు సంపాదించి రా...అప్పుడు చూద్దాం అంటుందా పిల్ల. ప్రేమకంటే డబ్బే విలువైందని ఆరోజు రమ్మీకి అర్ధమవుతుంది. ఆ తర్వాత ఆకలి అన్నింటికంటే విలువైందని గ్రహిస్తాడు. డబ్బు కోసం 'కేడి' పనులు మొదలెడతాడు. చిన్నచిన్న మోసాలు చేస్తుంటాడు. తన జర్నీలో గోవా వెళ్లినప్పుడు గాంబ్లర్ అవతారమెత్తి అక్కడ చంద్రాస్ పబ్ నడుపుతున్న చంద్ర (అంకుర్) దృష్టిలో పడతాడు. డబ్బిస్తే ఏపనికైనా సిద్ధమైనంటూ చంద్రతో రమ్మీ చేతులు కదుపుతాడు. స్లగ్లింగ్ ఆలవోకగా చేసేస్తుంటాడు. ఎసిపి శేఖర్ రెడ్ హ్యాండెడ్ గా రమ్మీని పట్టుకోవాలని ప్రయత్నించి విఫలమవుతుంటాడు. ఓ దశలో చంద్ర చెప్పిన ఓ బ్యాగ్ ను తెచ్చిపెట్టే పనిని రమ్మీ ఒప్పుకుని పోలీసులకు చిక్కుతాడు. ఎసిపి ముందు తన ఫ్లాష్ బ్యాక్ విప్పుతాడు. ఇందులో అంతర్భాగంగానే రమ్మీ చేసే పనులకు ఓ దశలో సంధ్య (మమతా మోహన్ దాస్) తోడవుతుంది. సంధ్య ఎవరు? జానకి ఏమైంది? ముందు చెప్పుకున్న బ్యాగ్ లో ఏముంది? వంటివి కథను క్లైమాక్స్ కు చేరుస్తాయి.