'అడవి' రివ్యూ
ఇండియన్ సినిమా నడక మార్చిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఎదురుచూసే ప్రేక్షకులకు కొదవ లేదు. డిఫరెంట్ జనర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టుగా ఆయనకు పేరుంది. సైకలాజికల్ థ్రిల్లర్లు, అండవరల్డ్ గ్యాంగ్ వార్ ఫేర్, రాజకీయాలు-నేరస్థుల సంబంధాలు..ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన ఇతివృత్తాలతో జనం ముందుకు వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆయనకు సైతం బాక్సాఫీస్ వైఫల్యాలు తప్పడం లేదు. నలుగురూ నడిచిన బాటలోనే వర్మ నడిస్తే చూడాలని ఎవరనుకుంటారు? వర్మ అంటేనే క్రియేటివిటీకి మారుపేరు అని కదా..మరి ఎక్కడ లోపం జరుగుతోంది? ఇంత తీరుబడిగా ఆలోచించేందుకు వర్మ సిద్దంగా ఉన్నట్టు కనిపించదు. ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రోజుకో ప్రోడక్ట్ (సినిమా) అందించాలనే లక్ష్యం మంచిదే కానీ...అందుకు అస్త్రశస్త్రాలు కావాలి కదా. 'అనగనగా ఓ రాజు..ఆయనకు ఏడుగురు కొడుకులు...వేటకు వెళ్లి ఏడు చేపలు పట్టారు' అనే కథనే వర్మ కూడా చెప్పదలిస్తే తెలివిమీరిన (తెలివిగల) ప్రేక్షకుల చెవికెక్కుతుందా? అడవిలోకి ఉద్దేశపూర్వకంగానో, యాదృచ్ఛికంగానే వెళ్లిన కొందరు అనుమానాస్పద స్థితిలో ఒక్కొక్కరూ మృత్యువాత పడుతూ, దీనివెనుక ఓ మిస్టరీ ఉందని చూపించే ఫార్ములాకు హిమాలయాలంత పాత చరిత్ర ఉందని వర్మకు చెప్పాలా? చెప్పినా చెప్పకపోయినా వర్మ సంధించిన 'అడవి' కూడా ఈ కోవలోనిదే. వర్మ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా అంటారా? ఉంది. ఫారెస్ట్ లోని మర్టర్స్ మిస్టరీకి కారకులెవరనేది ఎవరికి తోచింది వారు ఊహించుకోమని తెరదించేశారు. సీక్వెల్ ఆలోచన ఉందనే ఫీలర్లూ వదిలారు. రేపటి ముచ్చటెందుకు కానీ నేటి ముచ్చట్లోకి ఓ సారి చూద్దాం...
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా షూటింగ్ కోసం ఓ చిత్రయూనిట్ దట్టమైన అడువుల్లోకి అడుగుపెడుతుంది. ఆ టీమ్ లో పది మంది ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరో శర్మన్ బాబు (గౌతమ్ రూడ్), క్రేజీ హీరోయిన్ ఆషా (ప్రియాంక కొఠారి), అసిస్టెంట్ డైరెక్టర్ సుజన్ (నితిన్), అతని సన్నిహితురాలు సమీరా (రసిక), నిర్మాత మూర్తి (ఇష్రత్ అలి), దర్శకుడు జె.జె. (హార్వే), స్పాట్ బాయ్ (ఇస్తియాక్), యాక్షన్ డైరెక్టర్ రాఖా (రవికాలే), కెమెరామన్ శేఖర్ ఈ టీమ్ లో ఉంటారు. అడవిలో గైడ్ గా సేతు (జాయ్) అనే వ్యక్తి వీరితో కలుస్తాడు. శర్మన్ బాబు తానో పెద్ద హీరో అనే గర్వంతో టీమ్ సభ్యులతో దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. మరోవైపు ఆషాను సుజన్ ప్రేమిస్తుంటాడు. ఒకరోజు అందరూ సేతుతో కలిసి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఆ రోజు రాత్రి ఆకాశం నుంచి ఏదో వస్తువు అడవుల్లోకి జారిపడుతుంది. అది తోకచుక్క కావచ్చని అంతా అనుకుంటారు. ఏదో కొత్త అరుపు వినిపించడంతో ఆ వివరం కనుక్కునేందుకు వెళ్లిన సేతు శవమై తేలుతాడు. దీంతో అందరూ భయంతో వణికి పోతారు. ఆ హత్య చేసింది మనిషా? మృగమా? మానవాతీత శక్తా? అనేది మిస్టరీ అవుతోంది. ఆ తర్వాత క్రమంలో నిర్మాత, దర్శకుడు, స్పాట్ బాయ్ ఇలా...ఒక్కొక్కరుగా ఆ అజ్ఞాత శక్తి చేతిలో హతమవుతారు. చివరకు ఇద్దరే మిగులుతారు. ఆ హత్యలు చేసిన అజ్ఞాత శ(వ్య)క్తి ఎవరనే మిస్టరీ మాత్రం ఎవరికి తోచింది వారు ఊహించుకోవాల్సిందే. ఎందుకంటే వర్మ ముగింపు ఇవ్వలేదు కాబట్టి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|