'మాయాబజార్' రివ్యూ
తెలుగు సినీ ప్రేక్షకుడి గుండె చప్పుడు 'మాయాబజార్'
చలన చిత్ర అభిమానులకు ప్రాత:స్మరణీయుడు కె.వి.రెడ్డి
ఎన్నో 'విజయా'ల సారథులు నాగిరెడ్డి-చక్రపాణి ద్వయం
వెరసి...'మాయాబజార్' తెలుగు సినిమాకి ఓ ఎన్ సైక్లోపిడియా.
కొన్ని సినిమాలు చూసిన కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. చూసే కంటికి విసుగు లేకపోతే చూసిన ప్రతిసారీ ఏదో ఓ కొత్తదనం కనిపిస్తూ ఉండే చిత్రం ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే అందుకు సుస్పష్టమైన సమాధానం 'మాయాబజార్'. 1957 మార్చి 27న విజయా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఐదు దశాబ్దాలకు పైగా ఈ చిత్రం ఎన్నిసార్లు రీ-రిలీజ్ అయిందో, ఎన్ని వందల సమీక్షలు చూరగొందో, సగటు సినీ ప్రేక్షకుడు ఎన్నెన్ని సార్లు విసుగు విరామం లేకుండా చూసాడో చెప్పాలంటే ఎప్పటికీ లెక్కలు తేలవు. నిజానికి శశిరేఖా పరిణయ వృత్తాంతం ఆధారంగా భారతీయ భాషల్లో 11 సినిమాలు రూపుదిద్దుకున్నాయి. వాటిలో ఒకటి మూకీ కూడా. తెలుగులో మూడుసార్లు వచ్చిన చిత్రమిది. 1936లో వేల్ పిక్చర్స్ బ్యానర్ లో పి.వి.దాసు నిర్మాణదర్శకత్వంలో వచ్చిన 'మాయాబజార్' ఒకటైతే, 1957లో విజయావారి 'మాయాబజార్' రెండవది. మూడవది దాసరి దర్శకత్వంలో వచ్చిన సాంఘిక 'మాయాబజార్'. ఒక లెక్క కోసమే ఈ ప్రస్తావన అయినా...విజయా వారి 'మాయాబజార్' మాత్రం నాటి నుంచి నేటి దాకా ఎప్పుడు ఎక్కడ విడుదలైనా విజయఢంకా మోగిస్తూ వయోభేదం లేకుండా ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. ఐదు దశాబ్దాల క్రితం అద్భుతాలు సృష్టించిన ఈ చిత్రాన్ని చూసి 'జురాసిక్ పార్క్', 'అవతార్' చిత్రాలు మావే అని ఇప్పుడు సగర్వంగా చెప్పుకునే హాలీవుడ్ పరిశ్రమ నివ్వెరపోయింది. ఛాయాగ్రహణ మాంత్రికుడు మార్కస్ బార్టెలే ప్రతిభను చూసి ముక్కున వేలేసుకుంది. గోఖలే, కళాధర్ లు రూపొందించిన సెట్స్, మినియేచర్స్ చూసి దిమ్మదిరిగి పోయింది. ఇది చరిత్ర. కాలక్రమంలో రీ-రిలీజ్ లకు అవకాశాలు మృగ్యం కావడంతో సినిమా నెగిటివ్ లు దయనీయ పరిస్థితిలోకి వెళ్లిపోతూ నాటి 'స్వర్ణయుగ శోభ' అంతరించడం మొదలైంది. తరాలు మారి సాంకేతిక విప్లవం ముంగిటకు వచ్చిన తరుణంలో నాటి కళాఖండాలను ఇవాల్టి టెక్నాలజీకి అనుసంధానించి నేటి తరానికి అందించేందుకు ఎవరు ఏ చిన్ని ప్రయత్నం చేసినా అది ఆహ్వానించదగిన పరిణామమే. అలాంటి 'మాయా'జాలం ఇప్పుడు మళ్లీ 'మాయాబజార్'తోనే మొదలుకావడం శుభపరిణామం. గోల్డ్ స్టోన్ టెక్నాలజీకి చెందిన కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్ మోహన్ ఇందుకు శ్రీకారం చుట్టి ఐదు దశాబ్దాల క్రితం నాటి 'మాయాబజార్'ను కలర్, సినిమా స్కోప్, డిజిటల్ సౌండ్స్ తో వెండితెర మీదకు తీసుకువచ్చారు. 'చార్ అణా' టిక్కెట్ ఉన్న రోజుల్లో 'మాయాబజార్'ను చూసిన నాటి ప్రేక్షకులను కూడా మళ్లీ ఇవాల్టి జనరేషన్ తో కలిసి థియేటర్లలో చూడగలగడం వినూత్న అనుభూతే. 'సూపర్ గుడ్' ప్రయత్నమిది.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|